Rajam: రాజాంలో భూకబ్జాల కలకలం.. చెరువును కాపాడుకునేందుకు మహిళల పోరాటం!
Rajam: రాజాం మండలం డోలపేటలో 6 ఎకరాల చెరువు ఆక్రమణపై గ్రామస్థుల ఆగ్రహం. కలెక్టరేట్ ఎదుట ధర్నా చేసిన మహిళలు, ఆయకట్టు రైతులు.
Rajam: రాజాంలో భూకబ్జాల కలకలం.. చెరువును కాపాడుకునేందుకు మహిళల పోరాటం!
Rajam: ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గంలో భూకబ్జాల ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. చెరువులు, భూములు, ఖాళీ స్థలాలు లక్ష్యంగా కొందరు అక్రమ ఆక్రమణలకు పాల్పడుతున్నారంటూ గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారాల వెనుక అధికారుల నిర్లక్ష్యం, పాలకుల అండదండలు ఉన్నాయంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రశ్నించిన వారిని బెదిరింపులు, కేసులతో భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్న ఆరోపణలూ వినిపిస్తున్నాయి.
రాజాం మండలం డోలపేట గ్రామంలో సుమారు ఆరు ఎకరాల చెరువును ఆక్రమించి, రాత్రికి రాత్రే ప్రహరీ గోడ నిర్మించారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. కోట్ల రూపాయల విలువైన ఈ చెరువు ఆక్రమణతో గ్రామ ప్రజలు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. స్థానిక స్థాయిలో ఫిర్యాదులు చేసినా ఫలితం లేకపోవడంతో మహిళలు, గ్రామస్థులు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి వినతిపత్రం సమర్పించారు. ఆక్రమణదారులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
అయితే అధికారుల స్పందన కోసం ఎదురుచూడకుండా, తమ చెరువును తామే కాపాడుకుంటామని డోలపేట మహిళలు, గ్రామస్థులు, ఆయకట్టు రైతులు చెరువు వద్ద ఆందోళన చేపట్టారు. ఆక్రమణలను తొలగించి, బాధ్యులపై చర్యలు తీసుకునే వరకు తమ పోరాటం కొనసాగుతుందని నినాదాలతో నిరసన వ్యక్తం చేశారు.




