Smartphone: మొబైల్ మార్కెట్లో ఏఐ హవా.. స్మార్ట్ఫోన్ కొనుగోళ్లను శాసిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్!
Smartphone: దేశంలో స్మార్ట్ఫోన్ కొనుగోళ్లను ఏఐ ఫీచర్లు నడిపిస్తున్నాయని సైబర్మీడియా రీసెర్చ్ (సీఎంఆర్) తాజా నివేదిక వెల్లడించింది.
Smartphone: మొబైల్ మార్కెట్లో ఏఐ హవా.. స్మార్ట్ఫోన్ కొనుగోళ్లను శాసిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్!
Smartphone AI Features: గ్లోబల్ స్మార్ట్ఫోన్ మార్కెట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) హవా నడుస్తోంది. ప్రస్తుతం వినియోగదారులు కొత్త మొబైల్ కొనేటప్పుడు డిజైన్, ధర, బ్యాటరీ లైఫ్ కంటే కూడా 'ఏఐ ఫీచర్ల'కే తొలి ప్రాధాన్యత ఇస్తున్నట్లు సోమవారం విడుదలైన ఒక నివేదిక వెల్లడించింది. ప్రముఖ మార్కెట్ రీసెర్చ్ సంస్థ 'సైబర్మీడియా రీసెర్చ్' (CMR) నిర్వహించిన సర్వే ప్రకారం.. దాదాపు 68 శాతం మంది వినియోగదారులు తమ తదుపరి స్మార్ట్ఫోన్లో ఏఐ ఫీచర్లు ఉండాలని బలంగా కోరుకుంటున్నారు. అలాగే, 82 శాతం మంది పారదర్శక డేటా పద్ధతులు, విశ్వసనీయతనే కొనుగోలుకు ముఖ్య కారణాలుగా పేర్కొన్నారు.
ఆన్-డివైస్ ఏఐపై పెరుగుతున్న నమ్మకం:
సీఎంఆర్ నివేదిక ప్రకారం.. 61 శాతం మంది వినియోగదారులు ఆన్-డివైస్ ఏఐ (ఫోన్ లోపలే డేటా ప్రాసెస్ అవ్వడం) వైపు మొగ్గు చూపుతున్నారు. ఇది మొబైల్ ప్రతిస్పందనను వేగవంతం చేయడమే కాకుండా గోప్యతను (ప్రైవసీ) మెరుగుపరుస్తుందని వారు విశ్వసిస్తున్నారు. ఫోన్ కొనేటప్పుడు వినియోగదారులు ప్రధానంగా చూస్తున్న టాప్-3 అంశాలలో మొబైల్ పనితీరు (78 శాతం), ఏఐ మెరుగుదలలతో కూడిన కెమెరా నాణ్యత (70 శాతం), బలమైన ఏఐ ఫీచర్లు (59 శాతం) ముందంజలో ఉన్నాయి.
ట్రెండ్ మారుతోంది.. హార్డ్వేర్ వర్సెస్ ఏఐ:
దాదాపు ఒకే ధర ఉన్న రెండు వేర్వేరు స్మార్ట్ఫోన్ల మధ్య ఎంచుకోవాల్సి వచ్చినప్పుడు.. 60 శాతం మంది వినియోగదారులు ఏఐ మరియు బలమైన హార్డ్వేర్ రెండింటి మధ్య సమతుల్యతను కోరుకుంటున్నారు. ఇందులో దేనినీ వదులుకోవడానికి వారు సిద్ధంగా లేరు. ఇక 25 శాతం మంది వినియోగదారులు పూర్తిగా ఏఐ ఫీచర్ల ఆధారంగానే ఫోన్ కొంటుండగా, కేవలం 15 శాతం మంది మాత్రమే పాత పద్ధతిలో సాంప్రదాయ హార్డ్వేర్కు ప్రాధాన్యత ఇస్తున్నారు.
"స్మార్ట్ఫోన్లలో ఏఐ అనేది ఇకపై కేవలం ఒక అదనపు ఫీచర్ కాదు; అది డివైజ్ యొక్క మొత్తం అనుభవాన్ని పూర్తిగా మార్చేస్తోంది. అన్ని వర్గాల మరియు అన్ని ధరల విభాగాలలో వినియోగదారులు తమ రోజువారీ కార్యకలాపాలలో సజావుగా కలిసిపోయే సహజమైన ఏఐని ఆశిస్తున్నారు," అని సైబర్మీడియా రీసెర్చ్ (CMR) ఇండస్ట్రీ రీసెర్చ్ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ ప్రభు రామ్ విశ్లేషించారు




