Meta: మెటాకు మోదీ సర్కార్ బిగ్ షాక్.. బూతు కంటెంట్‌పై నోటీసులు!

Meta: ఇన్‌స్టాగ్రామ్‌లో అభ్యంతరకర ప్రకటనలు, వాట్సాప్ 'యూజర్‌నేమ్' ఫీచర్ ద్వారా సైబర్ నేరాల ముప్పుపై కేంద్ర ఐటీ శాఖ మెటా సంస్థకు గట్టి నోటీసులు జారీ చేసింది.

Naresh.k
Published on: 4 July 2026 8:11 AM IST
Meta
X

Meta: మెటాకు మోదీ సర్కార్ బిగ్ షాక్.. బూతు కంటెంట్‌పై నోటీసులు!

Instagram: ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం 'మెటా'కు కేంద్ర ప్రభుత్వం మరోసారి గట్టి షాక్ ఇవ్వడానికి సిద్ధమైంది. మన దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఇన్‌స్టాగ్రామ్ , వాట్సాప్ వేదికలుగా యూజర్ల భద్రతకు ముప్పు వాటిల్లుతోందని భావిస్తున్న కేంద్ర ఐటీ శాఖ.. మెటాకు గట్టి నోటీసులు జారీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. చిన్నారుల భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం అత్యంత కఠినమైన నిర్ణయాలు తీసుకుంటోంది. చిన్నారులపై లైంగిక వేధింపులను ప్రోత్సహించేలా ఉన్న కంటెంట్‌ను, ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని అకౌంట్లు ప్రకటనల రూపంలో ప్రమోట్ చేయడంపై కేంద్ర ఐటీ శాఖ తీవ్రంగా పరిగణించింది.

అసలు ఇలాంటి అత్యంత అభ్యంతరకరమైన, చట్టవ్యతిరేకమైన ప్రకటనలను మీ అల్గారిథమ్స్ ఎలా అనుమతించాయి? దీనిపై వెంటనే వివరణ ఇవ్వాలంటూ మెటాకు నోటీసులు పంపేందుకు కేంద్ర ఐటీ శాఖ మంత్రి నుండి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు అందాయి. కేవలం ఇన్‌స్టాగ్రామ్ మాత్రమే కాదు.. వాట్సాప్ కొత్తగా తీసుకురావాలని చూస్తున్న యూజర్‌నేమ్ ఫీచర్ పై కూడా కేంద్రం ఇప్పటికే నోటీసులు జారీ చేసింది.

ఏమిటా ఫీచర్? మొబైల్ నంబర్ అవసరం లేకుండా, కేవలం ఒక యూజర్‌నేమ్ ద్వారా ఇతరులతో చాట్ చేసుకునే సదుపాయం ఇది. ఈ ఫీచర్ రావడం వల్ల నకిలీ అకౌంట్లు సృష్టించడం సులువవుతుందని, తద్వారా ఆన్‌లైన్ మోసాలు, సైబర్ నేరాలు విపరీతంగా పెరిగే ప్రమాదం ఉందని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఫీచర్ వల్ల యూజర్ల భద్రతకు ఎలాంటి ముప్పు రాదని గట్టి ఆధారాలతో వివరణ ఇచ్చేంతవరకు.. దీన్ని భారతదేశంలో లాంచ్ చేయవద్దని మెటాను ప్రభుత్వం ఖచ్చితంగా ఆదేశించింది.

దేశంలో డిజిటల్ భద్రత, ముఖ్యంగా చిన్నారుల రక్షణ, యూజర్ల డేటా ప్రైవసీ విషయంలో ఏమాత్రం రాజీపడేది లేదని తాజా పరిణామాలతో కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. వ్యవస్థలను డిజిటలైజ్ చేస్తున్నాం కదా అని ఇష్టమొచ్చినట్లు చట్ట వ్యతిరేక కంటెంట్‌ను వదిలేస్తే చూస్తూ ఊరుకోబోమని, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిందేనని మోదీ సర్కార్ గట్టి హెచ్చరికలు జారీ చేసింది. సాంకేతికత ఎంత పెరిగినా.. సామాన్యుడి భద్రతే ఫస్ట్ అని ప్రభుత్వం తేల్చి చెప్పింది.

Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story