Sultanabad: సార్.. మీరు తలుచుకుంటే మా జీవితాలు మారుతాయి!
Sultanabad: తమను రెగ్యులర్ చేయాలని కోరుతూ పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావుకు రెండో ఏఎన్ఎంల వినతి.
Sultanabad: సార్.. మీరు తలుచుకుంటే మా జీవితాలు మారుతాయి!
Sultanabad: తమను రెగ్యులర్ చేయాలంటూ గత 20 ఏళ్లుగా పోరాడుతున్న రెండో ఏఎన్ఎంలు (2nd ANMs) మంగళవారం ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావును కలిసి తమ ఆవేదనను వెళ్లగక్కారు. సుల్తానాబాద్లో ఆయనకు వినతిపత్రం అందజేసిన ఏఎన్ఎంలు, తమ దీర్ఘకాలిక సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరారు.
20 ఏళ్ల నిరీక్షణ.. చాలీచాలని వేతనాలు
గత రెండు దశాబ్దాలుగా అత్యల్ప వేతనాలతో, విపరీతమైన పనిభారంతో విధులను నిర్వహిస్తున్నామని ఏఎన్ఎంలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో, ఆరోగ్య సేవలు అందించడంలో రాత్రింబవళ్లు శ్రమిస్తున్నామని, అయినప్పటికీ తమకు ఉద్యోగ భద్రత కరువైందని వారు పేర్కొన్నారు.
సీఎం రేవంత్ రెడ్డికి మీరు అత్యంత సన్నిహితులు..
"సార్.. మీరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితులు. మీరు తలుచుకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వేలాది మంది రెండో ఏఎన్ఎంల జీవితాల్లో వెలుగులు వస్తాయి" అని వారు ఎమ్మెల్యేను వేడుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో తాము పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ధర్నా చేసినప్పుడు, అప్పట్లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న విజయరమణారావు తమకు మద్దతు తెలిపి, న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు.
ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని హామీ
ప్రభుత్వ విప్ విజయరమణారావు ఏఎన్ఎంల విన్నపాన్ని సానుకూలంగా విన్నారు. క్షేత్రస్థాయిలో వారు పడుతున్న ఇబ్బందులను అర్థం చేసుకున్నానని, సాక్షాత్తు ముఖ్యమంత్రితో మాట్లాడి రెండో ఏఎన్ఎంల సమస్యల పరిష్కారానికి, వారిని రెగ్యులర్ చేసే అంశంపై సానుకూల నిర్ణయం తీసుకునేలా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. తమ మొరను ఆలకించిన ఎమ్మెల్యేపై ఏఎన్ఎంలు నమ్మకం వ్యక్తం చేశారు.


