Weather Update : ఏంటో ఈ వెదర్.. ఉదయం ఊటీలా, మధ్యాహ్నం సహారా ఎడారిలా.. వచ్చే 3 రోజుల పరిస్థితి ఇదే
Weather Update : తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఏపీ, తెలంగాణలో వచ్చే మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది.
Weather Update
Weather Update : తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం అంచనాలకు అందడం లేదు. ఓ వైపు ఎండలు మండిపోతుంటే, మరోవైపు వరుణుడు ఒక్కసారిగా పలకరిస్తున్నాడు. ఈ చిత్రవిచిత్రమైన వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ద్రోణి, ఉపరితల ఆవర్తనం కారణంగా వచ్చే మూడు రోజులు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల వర్షాలు, మరికొన్ని చోట్ల భానుడి భగభగలు తప్పవని స్పష్టం చేసింది.
ఆంధ్రప్రదేశ్లో వాతావరణం ఎలా ఉండబోతోంది?
ఆంధ్రప్రదేశ్లో వాతావరణం రెండు రకాలుగా ఉంది. ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాంలో గురు, శుక్ర, శనివారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అయితే, వర్షం పడినా గాలిలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల ఉక్కపోత భరించలేనంతగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇక దక్షిణ కోస్తాలో మాత్రం వర్షాల జాడ లేదు, అక్కడ పొడి వాతావరణమే ఉంటుంది.
రాయలసీమలో ఎండల గండం
రాయలసీమ ప్రజలకు మాత్రం ఎండల నుంచి ఉపశమనం లభించేలా లేదు. గురు, శుక్రవారాల్లో అక్కడక్కడ జల్లులు పడే అవకాశం ఉన్నప్పటికీ, గరిష్ట ఉష్ణోగ్రతలు 42 నుంచి 44 డిగ్రీల వరకు నమోదయ్యే ప్రమాదం ఉంది. శనివారం నాటికి అక్కడ పూర్తిగా పొడి వాతావరణం ఏర్పడి, ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. రాబోయే ఐదు రోజులు సీమ జిల్లాల్లో వేడి గాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తెలంగాణలో వానలు.. పెరగనున్న ఉష్ణోగ్రతలు
తెలంగాణలో కూడా వాతావరణం గమ్మత్తుగా మారింది. తూర్పు విదర్భ నుంచి కొమరిన్ ప్రాంతం వరకు విస్తరించిన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడ మోస్తరు వర్షాలు పడవచ్చు. అయితే, శనివారం నుంచి వాతావరణం మారిపోయి పొడిగా మారుతుంది. రానున్న మూడు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 1 నుంచి 2 డిగ్రీలు పెరిగే ఛాన్స్ ఉంది.
ఈ రోజు వాతావరణం ఎలా ఉంటుంది?
నేటి (ఏప్రిల్ 24, 2026) వాతావరణం విషయానికొస్తే.. ఏపీలోని ఉత్తర కోస్తా జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. సాయంత్రం వేళల్లో ఈదురు గాలులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. తెలంగాణలోని హైదరాబాద్ సహా పరిసర జిల్లాల్లో ఉదయం నుంచి ఎండ తీవ్రత ఉన్నప్పటికీ, సాయంత్రానికి వాతావరణం చల్లబడవచ్చు. రాయలసీమలో మాత్రం మధ్యాహ్నం వేళ బయటకు రావాలంటేనే జనం భయపడేలా ఎండలు దంచికొట్టనున్నాయి. వేడి గాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం.




