Rajahmundry: షాకింగ్: గోదావరిలో దూకిన ఏపీఎస్పీ కానిస్టేబుల్ వంశీ మృతి!

Rajahmundry: రాజమహేంద్రవరం రోడ్ కం రైలు వంతెనపై నుంచి గోదావరిలోకి దూకి ఏపీఎస్పీ కానిస్టేబుల్ వంశీ ఆత్మహత్య.

Arun Chilukuri
Published on: 20 Jun 2026 11:28 AM IST
Rajahmundry
X

Rajahmundry: షాకింగ్: గోదావరిలో దూకిన ఏపీఎస్పీ కానిస్టేబుల్ వంశీ మృతి!

Rajahmundry: రాజమహేంద్రవరం రోడ్‌ కం రైలు వంతెనపై నుంచి గోదావరి నదిలోకి దూకి గల్లంతైన కాకినాడకు చెందిన ఏపీఎస్పీ (APSP) కానిస్టేబుల్‌ చంద్రమళ్ల వంశీ విషాదాంతంగా ముగిశారు. గురువారం అర్ధరాత్రి నదిలోకి దూకిన ఆయన మృతదేహం సుదీర్ఘ గాలింపు చర్యల అనంతరం శనివారం ఉదయం లభ్యమైంది.

పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా శ్రీరాంపురానికి చెందిన చంద్రమళ్ల వంశీ (31) కాకినాడ ఏపీఎస్పీ మూడో బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం సెలవులో ఉన్న వంశీకి కుటుంబ సభ్యులు పెళ్లి సంబంధం చూసి, నిశ్చితార్థానికి (Engagement) అన్ని ఏర్పాట్లు చేశారు.

అయితే, అప్పటికే పరిచయం ఉన్న ఓ మహిళా కానిస్టేబుల్‌.. రాజమహేంద్రవరం మహిళా పోలీసుస్టేషన్‌లో వంశీపై ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై మహిళా పోలీసులు పలుమార్లు వంశీని స్టేషన్‌కు పిలిపించి విచారించారు. తాజాగా గురువారం కూడా వంశీకి పోలీసులు మరోసారి కౌన్సెలింగ్‌ నిర్వహించారు.

గురువారం కౌన్సెలింగ్ ముగిసిన తర్వాత.. అదేరోజు అర్ధరాత్రి దాటిన (శుక్రవారం తెల్లవారుజామున) సమయంలో వంశీ నేరుగా రాజమహేంద్రవరం రోడ్ కం రైలు వంతెనపైకి వెళ్లారు. అక్కడ నుంచి తన తండ్రికి ఫోన్‌ చేసి, తాను గోదావరి నదిలోకి దూకుతున్నట్లు చెప్పి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కంగారుపడిన కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వంతెనపైకి వెళ్లి పరిశీలించగా.. వంశీకి చెందిన ద్విచక్రవాహనం, చెప్పులు అక్కడ లభ్యమయ్యాయి.

వెంటనే రంగంలోకి దిగిన ఎస్డీఆర్‌ఎఫ్‌ (SDRF) బృందాలు శుక్రవారం రోజంతా నదిలో గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ రాత్రి వరకు ఆయన ఆచూకీ లభ్యం కాలేదు. శనివారం ఉదయం మళ్లీ గాలింపు చేపట్టగా.. వంశీ మృతదేహం నదిలో నుంచి వెలికితీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

తన కుమారుడి మృతిపై వంశీ తండ్రి వీర వెంకట్రావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ సంచలన ఆరోపణలు చేశారు. "ఇటీవలే నా కుమారుడు వంశీకి పెళ్లి సంబంధం కుదిరింది. అయితే అప్పటికే పరిచయం ఉన్న ఓ మహిళా కానిస్టేబుల్‌.. తననే పెళ్లి చేసుకోవాలంటూ వంశీని మానసికంగా తీవ్రంగా వేధించింది. ఆ మహిళా కానిస్టేబుల్‌ను వివాహం చేసుకోకపోతే ఉద్యోగం పోతుందని ఇటు పోలీసులు కూడా వంశీపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. ఈ మానసిక ఒత్తిడి తట్టుకోలేకే నా కుమారుడు గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు" అని వీర వెంకట్రావు వాపోయారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఒక యువ కానిస్టేబుల్ పెళ్లి పీటలు ఎక్కాల్సిన సమయంలో ఇలా ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story