Alleti Maheshwar Reddy: రేవంత్ రెడ్డికి దమ్ముంటే చర్చకు రావాలి.. డిలిమిటేషన్పై ఏలేటి సవాల్!
Alleti Maheshwar Reddy: నియోజకవర్గాల పునర్విభజనపై సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలను బీజేపీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు.
Alleti Maheshwar Reddy: రేవంత్ రెడ్డికి దమ్ముంటే చర్చకు రావాలి.. డిలిమిటేషన్పై ఏలేటి సవాల్!
Alleti Maheshwar Reddy: నియోజకవర్గాల పునర్విభజనపై కాంగ్రెస్ పార్టీ మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర రెడ్డి మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ప్రతిపాదిస్తున్న కొత్త విధానాలు రాజ్యాంగ విరుద్ధమని, కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఆయన ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు.
డిలిమిటేషన్ అనేది రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ. 1956లో జనాభా ప్రాతిపదికన పునర్విభజన జరగాలని చట్టం తెచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని ఆయన గుర్తు చేశారు. జనాభా ప్రాతిపదికన సీట్లు పెరగకపోతే ఎస్సీ, ఎస్టీలకు తీరని అన్యాయం జరుగుతుందని, వారు రాజకీయంగా ఎదగడం ఇష్టం లేకే రేవంత్ దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కేంద్రం తెచ్చే కొత్త ప్రతిపాదనలతో దక్షిణాది రాష్ట్రాలకు ఎక్కడా అన్యాయం జరగదని, జనాభా లెక్కల ప్రకారం వచ్చే సీట్ల కంటే ఎక్కువే వచ్చే అవకాశం ఉందని స్పష్టం చేశారు.
రేవంత్ రెడ్డి చెబుతున్న GSDP (ఆదాయం) ఆధారిత సీట్ల పంపిణీపై స్పందిస్తూ.. "అంటే కేవలం హైదరాబాద్కే సీట్లు పెరగాలా? ఆదిలాబాద్, మహబూబ్నగర్ వంటి వెనుకబడిన ప్రాంతాలకు సీట్లు అవసరం లేదా?" అని ప్రశ్నించారు. దేశాన్ని విభజించి పాలించాలనే బ్రిటిష్ ఆలోచన విధానాన్ని (Divide and Rule) రేవంత్ అమలు చేస్తున్నారని, ఉత్తర-దక్షిణ విభజన తీసుకురావద్దని హెచ్చరించారు. డిలిమిటేషన్ అంశంపై రేవంత్ రెడ్డితో బహిరంగ చర్చకు తాను సిద్ధమని, తన ఛాలెంజ్ను స్వీకరించే ధైర్యం ముఖ్యమంత్రికి ఉందా? అని సవాల్ విసిరారు.
రేవంత్ రెడ్డి కన్ను మల్లికార్జున ఖర్గే సీటుపై పడిందని, రాహుల్ గాంధీని ప్రసన్నం చేసుకోవడానికే ఇలాంటి వింత ప్రతిపాదనలు చేస్తున్నారని మహేశ్వర రెడ్డి ఎద్దేవా చేశారు. పాలనపై దృష్టి పెట్టడం మాని, డైవర్షన్ పాలిటిక్స్ ఆపాలని హితవు పలికారు.




