Ramchander Rao: సిట్ అంటే కూర్చోవడమే.. రాష్ట్రంలో నడుస్తోంది గూండా రాజ్యం
Ramchander Rao: తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
Ramchander Rao: సిట్ అంటే కూర్చోవడమే.. రాష్ట్రంలో నడుస్తోంది గూండా రాజ్యం
Ramchander Rao: తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న డ్రగ్స్ కేసు మరియు శాంతిభద్రతల అంశంపై ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం డ్రగ్స్ నిర్మూలిస్తామని చెప్పే మాటలన్నీ ఉత్తుత్తివేనని ఆయన ఎద్దేవా చేశారు.
సిట్ వల్ల ఒరిగేదేమీ లేదు:
మొయినాబాద్ డ్రగ్స్ కేసు విచారణకు ప్రభుత్వం 'సిట్' (SIT) ఏర్పాటు చేయడంపై రామచందర్ రావు స్పందిస్తూ.. "సిట్ అంటేనే కూర్చోవడం అని అర్థం. గతంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఏం జరిగిందో.. ఈ డ్రగ్స్ కేసులోనూ అదే జరుగుతుంది. నాయకులే డ్రగ్స్ పార్టీల్లో పాల్గొనడం అత్యంత విచారకరం. స్కూలు పిల్లలకు కూడా డ్రగ్స్ సరఫరా అవుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది" అని మండిపడ్డారు. రాష్ట్రంలో డ్రగ్స్, ల్యాండ్, లిక్కర్ దందాలన్నీ కాంగ్రెస్ కనుసన్నల్లోనే సాగుతున్నాయని ఆయన ఆరోపించారు.
పోలీస్ వ్యవస్థ దుర్వినియోగం:
బీజేపీ కార్యకర్తలపై దాడులు పెరిగాయని, చండూరులో జరిగిన హత్యాయత్నం ఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు. పోలీసులను అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ నాయకులు స్వార్థ రాజకీయాలు చేస్తున్నారని, నల్లగొండలో ప్రజాస్వామ్యం చచ్చిపోయి రాచరిక పాలన నడుస్తోందని విమర్శించారు. పెద్దపల్లి, మంచిర్యాలలో బీజేపీని అణిచివేసేందుకు కుట్రలు చేస్తున్నారని, కార్యకర్తలపై దాడులు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.
కరెంట్ కోతలపై ఆగ్రహం:
రాష్ట్రంలో విపరీతమైన కరెంట్ కోతలు ఉన్నాయని, దీనివల్ల రైతుల పంటలు ఎండిపోతున్నాయని రామచందర్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్ఎస్ఎస్ (RSS)ను నిషేధించాలని కాంగ్రెస్ అనడం వారి దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని, ఒకప్పుడు దేశ నిఘా విభాగం 'రా' (RAW)ను కూడా నిషేధించాలని కోరిన చరిత్ర కాంగ్రెస్దని ఆయన గుర్తు చేశారు.




