Ramachander Rao: ఎన్ని పార్టీలు వచ్చినా భయం లేదు.. తెలంగాణలో గెలిచేది బీజేపీయే
Ramachander Rao: తెలంగాణలో ఎన్ని పార్టీలు వచ్చినా బీజేపీకి వచ్చే నష్టం లేదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు స్పష్టం చేశారు.
Ramachander Rao: ఎన్ని పార్టీలు వచ్చినా భయం లేదు.. తెలంగాణలో గెలిచేది బీజేపీయే
Ramachander Rao: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త పార్టీల రాకపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు స్పందించారు. రాష్ట్రంలో ఎన్ని రాజకీయ పార్టీలు ఉన్నా, మరిన్ని కొత్త పార్టీలు పుట్టుకొచ్చినా భారతీయ జనతా పార్టీకి ఎలాంటి ఇబ్బంది లేదని ఆయన స్పష్టం చేశారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన 'పండిట్ దీన్దయాల్ ప్రశిక్షణ అభియాన్' కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ గత 12 ఏళ్లుగా దేశంలో అత్యంత పారదర్శకమైన, అవినీతి రహిత పాలనను అందిస్తున్నారని రామచందర్ రావు కొనియాడారు. ఈ సుపరిపాలన వల్ల తెలంగాణలో కూడా బీజేపీకి అత్యంత సానుకూల వాతావరణం ఏర్పడిందని ఆయన విశ్లేషించారు. "తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు, రాబోయే రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం" అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెట్టడంపై స్పందిస్తూ.. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీలు పెట్టుకోవచ్చని, అయితే ఏ పార్టీ ప్రజల కోసం పనిచేస్తుందనేది ప్రజలే నిర్ణయిస్తారని పేర్కొన్నారు. గతంలో టీఆర్ఎస్, తర్వాత బీఆర్ఎస్, ఇప్పుడు మళ్ళీ కొత్త పేరుతో వస్తున్న పార్టీల పట్ల ప్రజలు అవగాహనతో ఉన్నారని ఎద్దేవా చేశారు.
పార్టీ కార్యకర్తలకు సిద్ధాంతపరమైన అవగాహన కల్పించేందుకు ఈ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. పార్టీ బలోపేతం, భవిష్యత్తు వ్యూహాలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.




