Peddapalli: వడగండ్ల బీభత్సం.. కన్నీటి పర్యంతమైన రైతులు!
Peddapalli: పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో అకాల వర్షం వల్ల దెబ్బతిన్న మక్కజొన్న పంటలను మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పరిశీలించారు.
Peddapalli: వడగండ్ల బీభత్సం.. కన్నీటి పర్యంతమైన రైతులు!
పెద్దపల్లి (కాల్వ శ్రీరాంపూర్): ఇటీవల కురిసిన వడగండ్ల వానలు పెద్దపల్లి జిల్లా రైతాంగాన్ని కోలుకోలేని దెబ్బ తీశాయి. అకాల వర్షం ధాటికి నేలవాలిన మక్కజొన్న పంటలను పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి శనివారం పరిశీలించారు. కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని వెన్నంపల్లి, కూనారం, మంగపేట, జాఫరాఖాన్ పేట గ్రామాల్లో పర్యటించిన ఆయన, దెబ్బతిన్న పంటలను చూసి ఆవేదన వ్యక్తం చేశారు.
400 ఎకరాల్లో పంట నష్టం:
ఈ సందర్భంగా మనోహర్ రెడ్డి మాట్లాడుతూ.. కాల్వ శ్రీరాంపూర్ మండలంలో సుమారు 400 ఎకరాల్లో మక్కజొన్న పంట పూర్తిగా దెబ్బతిందని తెలిపారు. "పాలు పోసుకునే దశలో ఉన్న మక్క చేన్లు వడగండ్ల వానకు నేలమట్టం అయ్యాయి. చేతికందే సమయంలో పంట నాశనం కావడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు" అని ఆయన పేర్కొన్నారు.
ప్రభుత్వానికి డిమాండ్లు:
పంట నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు రూ. 40,000 చొప్పున ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి అధికారులతో సమగ్ర సర్వే చేయించాలి.
క్షేత్రస్థాయిలో నష్టాన్ని అంచనా వేసి రైతులకు భరోసా కల్పించాలి.
ఎటువంటి జాప్యం లేకుండా అన్నదాతలను ఆదుకోవాలి.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ మంథని రాజయ్య, మాజీ ఎంపీపీ నూనేటి సంపత్, మాజీ ఎంపీటీసీ జెట్టి దేవేందర్ మరియు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.




