Telangana Rythu Bharosa: అన్నదాతలకు అలర్ట్.. మూడో విడత రైతు భరోసా ఎప్పుడంటే?
Telangana Rythu Bharosa: తెలంగాణ రైతన్నలకు శుభవార్త! రెండో విడత రైతు భరోసా నిధులను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు.
Telangana Rythu Bharosa: అన్నదాతలకు అలర్ట్.. మూడో విడత రైతు భరోసా ఎప్పుడంటే?
Telangana Rythu Bharosa: తెలంగాణ ప్రభుత్వం అన్నదాతలకు ఇచ్చిన హామీని నెరవేరుస్తూ రైతు భరోసా నిధులను విడుదల చేసింది. సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా నస్తూర్పల్లిలో నిర్వహించిన 'రైతు ఉత్సవం'లో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కంప్యూటర్ బటన్ నొక్కి రెండో విడత నిధులను రైతుల ఖాతాల్లోకి జమ చేశారు.
నిధుల విడుదల వివరాలు:
రెండో విడత: రూ. 2,206.06 కోట్లు (45.11 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి).
మొదటి విడత: ఇప్పటికే రూ. 3,446.94 కోట్లు విడుదల (68.89 లక్షల మందికి).
వచ్చే నెల లక్ష్యం: మరో రూ. 3,300 కోట్లు విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
మొత్తం: ఈ సీజన్కు గాను రూ. 9,000 కోట్ల నిధులు పంపిణీ చేయడమే లక్ష్యం.
వ్యవసాయం దండగ కాదు.. పండుగ కావాలి!
బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యతని స్పష్టం చేశారు. "దేశానికి వెన్నెముక రైతు. రైతును నిటారుగా నిలబెట్టే బాధ్యతను మా ప్రభుత్వం తీసుకుంది. అధికారం చేపట్టిన ఏడాదిలోనే రూ. 2 లక్షల రుణమాఫీ ద్వారా 25 లక్షల మంది రైతులకు మేలు చేశాం. సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి వ్యవసాయాన్ని పండుగలా మారుస్తాం" అని పేర్కొన్నారు.
మూడు విడతల్లో జమ:
తొలి విడతలో ఎకరం లోపు భూమి ఉన్న వారికి నిధులు అందగా, రెండో విడతలో సుమారు 36.76 లక్షల ఎకరాలకు సంబంధించి సాయం అందించారు. మిగిలిన రైతులకు వచ్చే నెలలో మూడో విడత నిధులను జమ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.




