Burugupalli: ఉపాధి కూలీల ఆవేదన.. రెండు నెలలుగా రాని వేతనాలు

Burugupalli: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్ పల్లి మండలం బూరుగుపల్లిలో ఉపాధి హామీ కూలీల సమస్యలను సిపిఎం నేతలు అడిగి తెలుసుకున్నారు.

N. Madhusudan Reddy, Karimnagar
Published on: 18 April 2026 1:59 PM IST
Burugupalli
X

Burugupalli: ఉపాధి కూలీల ఆవేదన.. రెండు నెలలుగా రాని వేతనాలు

Burugupalli: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్ పల్లి మండలం బూరుగుపల్లి గ్రామంలో ఉపాధి హామీ కూలీలను సిపిఎం పార్టీ నాయకులు కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. గత రెండు నెలలుగా బోయిన్ పల్లి మండలంలోని గ్రామాల్లో ఉపాధి హామీ కూలీలు చేసిన పనికి సంబంధించిన వేతనాలు సకాలంలో వారి ఖాతాల్లో జమ కాకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు.

వేతనాలు ఆలస్యంగా రావడం వల్ల కుటుంబ పోషణ, నిత్యావసరాల నిర్వహణలో ఇబ్బందులు పడుతున్నామని వారు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఉపాధి హామీ కూలీలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని సిపిఎం నాయకులు పేర్కొన్నారు.

అలాగే పని ప్రదేశాల్లో భద్రతా పరమైన కనీస సౌకర్యాలు కూడా లేవని కూలీలు తెలిపారు. తాగునీటి సౌకర్యం, టెంట్ ఏర్పాటు, మెడికల్ కిట్ వంటి మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఉపాధి హామీ కూలీలకు సకాలంలో వేతనాలు చెల్లించి, పని ప్రదేశాల్లో అవసరమైన సౌకర్యాలు కల్పించి వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిపిఎం పార్టీ పక్షాన పత్రికా ముఖంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల సిపిఎం పార్టీ కన్వీనర్ గురిజాల శ్రీధర్, మండల సిపిఎం పార్టీ నాయకులు కుడుకల గిరిబాబు మరియు ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.

N. Madhusudan Reddy, Karimnagar

N. Madhusudan Reddy, Karimnagar

Next Story