Egg Scam : రూ.2కే కోడిగుడ్డు.. ఎగబడ్డ జనం.. తీరా లోపల చూస్తే మైండ్ బ్లాక్

Egg Scam : హైదరాబాద్ బొల్లారంలో రూ.2 కే కుళ్లిన గుడ్లు అమ్ముతూ ప్రజలను వంచించిన విక్రేతను పోలీసులు పట్టుకున్నారు. తక్కువ ధరకు వస్తున్నాయని కొనేవారు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక.

CR Reddy
Published on: 22 April 2026 7:29 AM IST
Egg Scam
X

Egg Scam

Egg Scam : భాగ్యనగరంలో తక్కువ ధరకు వస్తున్నాయని ఆశపడితే నిలువునా మోసపోవాల్సిందే అనడానికి ఈ ఘటనే నిదర్శనం. ప్రస్తుతం మార్కెట్‌లో కోడిగుడ్డు ధర ఆరు రూపాయల పైమాటే ఉండగా, కేవలం రెండు రూపాయలకే గుడ్డు ఇస్తానంటూ ఓ ప్రబుద్ధుడు జనాలను నమ్మించి కుళ్లిన గుడ్లను అంటగట్టే ప్రయత్నం చేశాడు. తీరా అసలు విషయం బయటపడటంతో కంగుతిన్న స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ గుడ్డు బాగోతం వెలుగులోకి వచ్చింది.

ఏం జరిగిందంటే?

శనివారం రాత్రి హైదరాబాద్‌లోని బొల్లారం డివిజన్ జ్యోతి థియేటర్ సమీపంలో ఈ వింత ఘటన చోటు చేసుకుంది. సాధారణంగా మార్కెట్‌లో డజను గుడ్లు 70 నుంచి 80 రూపాయల వరకు పలుకుతుండగా, ఒక వ్యక్తి తోపుడు బండిపై వచ్చి కేవలం రెండు రూపాయలకే గుడ్డు ఇస్తున్నానంటూ కేకలు వేశాడు. రాత్రి వేళ ఇంత తక్కువ ధరకు గుడ్లు లభిస్తుండటంతో స్థానికులు ఎగబడ్డారు. ఒకేసారి వందల సంఖ్యలో గుడ్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపారు.

నిజం బయటపడింది ఇలా..

గుడ్లు కొంటున్న సమయంలో కొంతమందికి అనుమానం వచ్చింది. ఇంత తక్కువ ధరకు ఎలా ఇస్తున్నాడు? అని ఆలోచించి అక్కడే ఒక గుడ్డును పగలగొట్టి చూశారు. అంతే.. ఆ గుడ్డు లోపల నల్లటి పదార్థం, విపరీతమైన దుర్వాసన రావడంతో అందరూ షాక్ అయ్యారు. అది తింటే ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుందని గ్రహించిన ప్రజలు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సదరు విక్రేతను నిలదీయడంతో అతను నీళ్లు నమిలాడు.

పోలీసుల రంగప్రవేశం

సమాచారం అందుకున్న బొల్లారం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సదరు విక్రేతను అదుపులోకి తీసుకున్నారు. ప్రజల ఆగ్రహం చూసిన నిందితుడు తాను అప్పటివరకు అమ్మి తీసుకున్న డబ్బులను వెనక్కి ఇచ్చేశాడు. అయితే ఈ కుళ్లిన గుడ్లు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇవి ఏదైనా ఫామ్ నుంచి తీసేసినవా? లేక ఎక్కడైనా స్టాక్ ఉండి పాడైపోయినవా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. నగరంలో ఇలాంటి ముఠా ఏదైనా పనిచేస్తుందా అన్న కోణంలోనూ దర్యాప్తు సాగుతోంది.

అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి

ఈ ఘటనపై పోలీసులు స్పందిస్తూ.. ప్రజలు అతి తక్కువ ధరకు వచ్చే వస్తువుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఆహార పదార్థాల విషయంలో నాణ్యతను పరిశీలించకుండా కేవలం ధర తక్కువగా ఉందని కొనడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరించారు. ముఖ్యంగా గుడ్లు, మాంసం, నూనె వంటి వస్తువుల విషయంలో కల్తీ లేదా పాడైపోయినవి అమ్మే ముఠాలు తిరుగుతున్నాయని, ఏదైనా అనుమానం వస్తే వెంటనే ఫిర్యాదు చేయాలని సూచించారు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story