Karimnagar: కొనుగోలు కేంద్రాల వద్ద చల్లని నీడ కోసం.. రైతుల మొర!
Karimnagar: చొప్పదండిలో తీవ్ర ఎండలతో అల్లాడుతున్న రైతులు. వ్యవసాయ పనుల సమయాలను మార్చుకుని శ్రమిస్తున్న అన్నదాతలు.
Karimnagar: కొనుగోలు కేంద్రాల వద్ద చల్లని నీడ కోసం.. రైతుల మొర!
కరీంనగర్ జిల్లా: చొప్పదండి నియోజకవర్గం లోని రైతులు వేసవికాలంలో తీవ్ర ఎండల కారణంగా తమ వ్యవసాయ పనుల సమయాలను మార్చుకుని పని చేస్తున్నారు. ముఖ్యంగా వరి కోతలతో పాటు కొనుగోలు కేంద్రాల్లో వడ్లు నేర్పే పనులను ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే నిర్వహిస్తున్నామని రైతులు తెలిపారు. ఉదయం 10 గంటల తర్వాత ఎండ వేడిమి తీవ్రంగా పెరగడంతో పనులు కొనసాగించడం చాలా కష్టంగా మారుతోందని వారు అన్నారు.
అలాగే సాయంత్రం 5 గంటల తర్వాత మళ్లీ ఇంటి నుంచి పొలాలకు, కొనుగోలు కేంద్రాలకు వెళ్లి పనులు కొనసాగిస్తున్నామని చెప్పారు. వడదెబ్బ బారిన పడకుండా ఉండేందుకు మధ్య మధ్యలో ఓఆర్ఎస్, మజ్జిగ తీసుకుంటూ రోజుకు సుమారు నాలుగు నుంచి 5 లీటర్ల వరకు నీరు తాగుతున్నామని తెలిపారు.
అందువల్ల రైతుల కోసం కొనుగోలు కేంద్రాల వద్ద చలివేంద్రాలు ఏర్పాటు చేసి తాగునీరు, నీడ వంటి సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.




