Addanki Dayakar: బీజేపీ చేతిలో పవన్ కల్యాణ్ బలిపశువు.. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టొద్దు
Addanki Dayakar: జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై తెలంగాణ ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
Addanki Dayakar: బీజేపీ చేతిలో పవన్ కల్యాణ్ బలిపశువు.. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టొద్దు
Addanki Dayakar: హైదరాబాద్లోని గాంధీభవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలంగాణ ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్.. జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణలో జనసేన సభకు అనుమతి నిరాకరణ అంశంపై స్పందిస్తూ.. పవన్ కల్యాణ్ రాజకీయ అపరిపక్వతను, బీజేపీ ఆడుతున్న తెరవెనుక డ్రామాలను ఆయన ఎండగట్టారు.
"పవన్ కల్యాణ్కు అసలు రాజకీయం తెలియదు. సొంత రాజకీయ ప్రయోజనాల కోసం ప్రధాని మోదీ ఆయనను బలి చేస్తున్నారు" అని అద్దంకి దయాకర్ వ్యాఖ్యానించారు. తెలంగాణలో బీఆర్ఎస్ (BRS) పార్టీకి రాజకీయంగా లబ్ధి చేకూర్చడానికే 'బీజేపీ స్పాన్సర్డ్' లీడర్లా పవన్ కల్యాణ్ ఇక్కడకు వస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ మనుగడ కోసం బీజేపీ పవన్ కల్యాణ్ను ఒక అస్త్రంగా వాడుకుంటోందని.. తెలంగాణలో ఆయన ఎవరి కోసం రాజకీయం చేస్తున్నారో ఆయనకైనా క్లారిటీ ఉందా అని ప్రశ్నించారు. కేవలం రాజకీయాల కోసం దేనికైనా తెగబడటమేనా పవన్ సిద్ధాంతం? అని మండిపడుతూ.. పవన్ కల్యాణ్ తక్షణమే ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికారు.
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సభకు అనుమతి నిరాకరించడంపై స్పందిస్తూ.. "ఎంతో పవిత్రమైన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున పవన్ కల్యాణ్ సభకు పర్మిషన్ ఎట్లా ఇస్తారు? ఆ మాత్రం విచక్షణ లేకుండా పవన్ ఎలా ఆలోచిస్తారు?" అని అద్దంకి దయాకర్ నిలదీశారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావుకు, పవన్ కల్యాణ్కు మధ్య ఎలాంటి వ్యక్తిగత వైరుధ్యాలు ఉన్నాయో తమకు తెలియదని.. కానీ, బీజేపీ మాత్రం నల్లికుట్ల లాగా ప్రతి చిన్న విషయానికి పంచాయితీ పెట్టి కూర్చుంటోందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో పవన్ కల్యాణ్ అనే చిచ్చుబుడ్డిని పెట్టి అశాంతి సృష్టించాలని బీజేపీ చూస్తోందని ఆరోపించారు.
గతంలో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడినప్పుడు.. పవన్ కల్యాణ్ తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేశారని అద్దంకి దయాకర్ గుర్తు చేశారు. "తెలంగాణ వస్తుందని 11 రోజులు అన్నం తినలేదని పవన్ కల్యాణే స్వయంగా చెప్పుకున్నారు. తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల స్తూపం దగ్గరకు వెళ్లి కనీసం పట్టేడు పూలు కూడా వేయని వ్యక్తి పవన్" అని తీవ్రంగా దుయ్యబట్టారు.
పవన్ కల్యాణ్ ద్వంద్వ విధానాలపై విమర్శలు చేస్తూ.. ఒకప్పుడు తనను తాను విప్లవకారుడు 'చేగువేరా' వారసుడిగా చెప్పుకున్న పవన్, ఇప్పుడు సనాతన ధర్మం కోసం పోరాడుతున్నానని అంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కల్యాణ్.. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య, ప్రాంతాల మధ్య అనవసరంగా చిచ్చు పెట్టవద్దని అద్దంకి దయాకర్ గట్టిగా హెచ్చరించారు.




