Harish Rao: లంబాడీల ఆత్మగౌరవం నిలబెట్టింది కేసీఆరే.. చిన్న తండాలను పంచాయతీలుగా మార్చిన ఘనత బీఆర్ఎస్దే
Harish Rao: లంబాడీల ఆత్మగౌరవం నిలబెట్టింది కేసీఆర్ మాత్రమేనని మాజీ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు.
Harish Rao: లంబాడీల ఆత్మగౌరవం నిలబెట్టింది కేసీఆరే.. చిన్న తండాలను పంచాయతీలుగా మార్చిన ఘనత బీఆర్ఎస్దే
Harish Rao: తెలంగాణ రాష్ట్రంలో గిరిజనులు, లంబాడీల ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది ముమ్మాటికీ కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వమేనని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు స్పష్టం చేశారు. హైదరాబాద్లో లంబాడీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ 'మహాధర్నా'కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీశ్రావు తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు.
మహాధర్నాలో గిరిజనులను ఉద్దేశించి హరీశ్రావు మాట్లాడుతూ.. గిరిజనుల దశాబ్దాల నాటి కలలను నిజం చేసిన పార్టీ బీఆర్ఎస్ అని కొనియాడారు. "రాష్ట్రంలో 'మా తండాలో మా రాజ్యం' అనే నినాదాన్ని నిజం చేస్తూ, అతి చిన్న తండాలను కూడా గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత కేసీఆర్దే. లంబాడీల ఆత్మగౌరవం కోసం హైదరాబాద్లోని ఖరీదైన బంజారాహిల్స్ ప్రాంతంలో అద్భుతమైన బంజారా ఆత్మగౌరవ భవనాన్ని నిర్మించాం. అంతేకాకుండా, గిరిజన ఆరాధ్య దైవం సేవాలాల్ మహరాజ్ జయంతిని రాష్ట్ర పండుగగా అధికారికంగా నిర్వహించి ఆ సమాజానికి పీక్ గౌరవాన్ని ఇచ్చాం" అని హరీశ్రావు గుర్తు చేశారు.
గత ప్రభుత్వ హయాంలో గిరిజన యువతకు, విద్యార్థులకు చేకూర్చిన ప్రయోజనాలను ఆయన ఈ సందర్భంగా వివరించారు. 'టీఎస్ ప్రైడ్' (TS-PRIDE) పథకం ద్వారా దాదాపు 13,200 మంది గిరిజన లబ్ధిదారులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించామని చెప్పారు. అలాగే, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల విద్యార్థినుల కోసం ప్రత్యేకంగా డిగ్రీ కళాశాలలను నిర్మించి, కార్పొరేట్ స్థాయి విద్యను ఉచితంగా అందించినట్లు పేర్కొన్నారు.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనుల సంక్షేమాన్ని పూర్తిగా గాలికొదిలేసిందని హరీశ్రావు మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన గత రెండున్నరేళ్లుగా గిరిజనులను, ఎస్టీలను అడుగడుగునా మోసం చేస్తూనే ఉందని ధ్వజమెత్తారు.
సంత సేవాలాల్, కుమురం భీం, ఏకలవ్య కార్పొరేషన్లకు ఈ ప్రభుత్వం ఇప్పటివరకు కనీసం ఒక్క రూపాయి కూడా నిధులు కేటాయించలేదని ఆయన ఆరోపించారు. గిరిజన హక్కుల కోసం, కార్పొరేషన్లకు నిధుల సాధన కోసం బీఆర్ఎస్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, కాంగ్రెస్ మెడలు వంచైనా హక్కులను సాధించుకుంటామని హరీశ్రావు పిలుపునిచ్చారు.




