Harish Rao: బడ్జెట్ అంతా బోగస్.. స్కీమ్లు లేవు కానీ స్కామ్లు ఉన్నాయి
Harish Rao: అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు నిప్పులు చెరిగారు.
Harish Rao: బడ్జెట్ అంతా బోగస్.. స్కీమ్లు లేవు కానీ స్కామ్లు ఉన్నాయి
Harish Rao: అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు నిప్పులు చెరిగారు. ఈ బడ్జెట్ను "బోగస్ బడ్జెట్" మరియు "బడా జూటా బడ్జెట్" అని ఆయన అభివర్ణించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలపై చిత్తశుద్ధి లేదని ఈ పద్దు ద్వారా స్పష్టమైందని విమర్శించారు.
హరీష్ రావు చేసిన ప్రధాన ఆరోపణలు:
"రేవంత్, భట్టిలు కలిసి ఆరు గ్యారంటీలకు ఘోరీ కట్టారు. బడ్జెట్ కాగితాలు 20 పేజీలు పెంచారు తప్ప, హామీల అమలుకు కేటాయింపులు ఎక్కడ?" అని ప్రశ్నించారు. మహిళలకు ఇస్తామన్న రూ. 2,500 ఊసే లేదని మండిపడ్డారు.
మూడు సార్లు రైతుబంధు ఎగ్గొట్టినందుకు ప్రభుత్వం రైతులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పాలన గాడి తప్పడం వల్లే రాష్ట్ర తలసరి ఆదాయం తగ్గిందని ఆరోపించారు.
"కాంగ్రెస్ హయాంలో స్కీమ్లు లేవు.. కేవలం స్కామ్లే ఉన్నాయి. మేడారం టెండర్లలో అవినీతి జరిగిందని సాక్షాత్తూ మంత్రి బిడ్డ చెప్పడమే దీనికి నిదర్శనం" అని హరీష్ రావు విమర్శించారు.
అక్రమ సంపాదన దాచుకోవడానికే సీఎం విదేశీ పర్యటనలు చేస్తున్నారని, పెట్టుబడుల విషయంలో ప్రభుత్వం కట్టుకథలు చెబుతోందని ఎద్దేవా చేశారు. పారిశ్రామికవేత్తలను తుపాకులతో బెదిరించి వసూళ్లు చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఫిరాయింపు ఎమ్మెల్యేలను వెనుక కూర్చోబెట్టుకుని భట్టి విక్రమార్క రాజ్యాంగ విలువల గురించి మాట్లాడటం సిగ్గుచేటని హరీష్ రావు ధ్వజమెత్తారు.
అభయ హస్తం పేరుతో ప్రజలకు రిక్త హస్తం చూపారని, ఈ ప్రభుత్వం మూడు ముక్కలాట ఆడుతోందే తప్ప రాష్ట్ర అభివృద్ధిపై విజన్ లేదని దుయ్యబట్టారు.
సింగరేణిని కుంభకోణాల గనిగా మార్చిన కాంగ్రెస్కు దాని గురించి మాట్లాడే హక్కు లేదని, యాదాద్రి విషయంలో మంత్రుల మధ్యే ఏకాభిప్రాయం లేదని హరీష్ రావు ఎద్దేవా చేశారు.




