Telangana Bandh : పాఠశాలలు, కాలేజీలు బంద్... ప్రభుత్వం సెలవు ప్రకటించిందా లేదా?
Telangana Bandh : కేంద్ర విద్యా విధానాలకు నిరసనగా నేడు తెలంగాణలో స్కూళ్లు, కాలేజీల బంద్కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. ప్రభుత్వం ఎలాంటి అధికారిక సెలవు ప్రకటించలేదు.
Telangana Bandh
Telangana Bandh : కేంద్ర ప్రభుత్వ విద్యా విధానాలను తీవ్రంగా నిరసిస్తూ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్కు విద్యార్థి సంఘాల ఐక్య వేదిక పిలుపునిచ్చింది. ఈ రోజు జులై 24వ తేదీ (శుక్రవారం)న రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్, డిగ్రీ, ఇంజనీరింగ్ కళాశాలలు అన్నింటినీ మూసివేసి ఈ బంద్ను విజయవంతం చేయాలని విద్యార్థి సంఘాలు విజ్ఞప్తి చేశాయి. ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, ఎన్ఎస్యూఐ, పీడీఎస్యూ, ఏఐఎఫ్డీఎస్ సహా పలు ప్రధాన విద్యార్థి సంఘాలు ఈ ఆందోళనలో పాల్గొంటున్నాయి.
విద్యార్థి సంఘాల ప్రధాన డిమాండ్లు ఇవే
కేంద్రంలో విద్యా వ్యవస్థలో జరుగుతున్న వరుస లోపాలు, అక్రమాలకు నిరసనగా ఈ ఆందోళన చేపడుతున్నట్లు నేతలు తెలిపారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలి. వివాదాస్పదంగా మారిన జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ (NTA)ను వెంటనే రద్దు చేయాలి. దేశవ్యాప్తంగా జరిగిన వివిధ ప్రవేశ పరీక్షల నిర్వహణ అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఇటీవల ఢిల్లీలో శాంతియుతంగా నిరసన తెలిపిన విద్యార్థులపై పోలీసులు జరిపిన లాఠీఛార్జ్ను తీవ్రంగా ఖండిస్తూ, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలి.ఆందోళనల సందర్భంగా అరెస్టు చేసిన విద్యార్థులపై నమోదు చేసిన అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలి.
ప్రభుత్వం సెలవు ప్రకటించిందా?
ఈ బంద్ పిలుపు నేపథ్యంలో తల్లిదండ్రులు, విద్యార్థులలో తీవ్ర అయోమయం నెలకొంది. అయితే తెలంగాణ ప్రభుత్వం లేదా విద్యాశాఖ అధికారికంగా ఎలాంటి సెలవు ప్రకటించలేదు. ప్రభుత్వం నుంచి అధికారిక సెలవు లేకపోయినప్పటికీ, క్షేత్రస్థాయిలో విద్యార్థి సంఘాల నిరసనలు, ర్యాలీలు మరియు ధర్నాల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కొన్ని ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల యాజమాన్యాలు ముందస్తు జాగ్రత్తగా తరగతులను నిలిపివేయడం లేదా ఆన్లైన్ క్లాసులు నిర్వహించడం చేస్తున్నాయి. కాబట్టి విద్యార్థులు తమ తమ పాఠశాలలు, కళాశాలల యాజమాన్యం ఇచ్చే అధికారిక సమాచారాన్ని సరిచూసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.




