KCR: పార్లమెంట్‌లో తెలంగాణను అవమానిస్తుంటే కాంగ్రెస్ ఎంపీలు ఎక్కడున్నారు?

KCR: రాష్ట్రంలో రైతుల పరిస్థితి, పార్లమెంట్‌లో తెలంగాణపై జరిగిన చర్చలపై కేసీఆర్ స్పందించారు. ధాన్యం కొనుగోలులో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వంపై మరియు దిల్లీలో మౌనంగా ఉన్న ఎంపీలపై ఆయన చేసిన వ్యాఖ్యల పూర్తి వివరాలు.

Arun Chilukuri
Published on: 27 April 2026 5:11 PM IST
KCR
X

KCR: పార్లమెంట్‌లో తెలంగాణను అవమానిస్తుంటే కాంగ్రెస్ ఎంపీలు ఎక్కడున్నారు?

KCR: తెలంగాణలో రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైందని, ధాన్యం కొనుగోలు చేయడంలో ప్రస్తుత ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ధ్వజమెత్తారు. సోమవారం తెలంగాణ భవన్‌లో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఇటీవల పార్లమెంట్‌లో జరిగిన పరిణామాలపై కేసీఆర్ తీవ్రస్థాయిలో స్పందించారు. "తెలంగాణ గురించి ఎంపీ తేజస్వి సూర్య ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే.. ఇక్కడి కాంగ్రెస్, భాజపా ఎంపీలు నోరు మెదపకపోవడం సిగ్గుచేటు. అదే లోక్‌సభలో బీఆర్‌ఎస్ ఎంపీలు ఉండి ఉంటే రణరంగం సృష్టించేవాళ్లు" అని అన్నారు. రాజ్యసభలో సీఆర్ పాటిల్ కాళేశ్వరం ప్రాజెక్టుపై మాట్లాడినప్పుడు మన ఎంపీ సురేష్ రెడ్డి గట్టిగా ఖండించారని, కానీ అధికార పార్టీ నేతలు మాత్రం మౌనంగా ఉండిపోయారని విమర్శించారు.

తెలంగాణ ఉద్యమ కాలం నాటి విషయాలను గుర్తు చేసుకుంటూ కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. "రాష్ట్ర విభజన సమయంలో హైదరాబాద్ విషయంలో రాజీ పడాలని సోనియా గాంధీ స్వయంగా ఎన్నోసార్లు చెప్పారు. కానీ నేను ఎక్కడా తలవంచలేదు. తెలంగాణ ప్రయోజనాల కోసం నేను చూపిన చిత్తశుద్ధి అది" అని స్పష్టం చేశారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు పడుతున్న ఇబ్బందులపై ఆయన మండిపడ్డారు. రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం కాలయాపన చేస్తోందని, తక్షణమే కొనుగోళ్లు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దిల్లీ వద్ద తాకట్టు పెడుతున్న నేతలకు ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story