KTR: తెలంగాణలో కాంగ్రెస్ పని అయిపోయింది.. సీఎం రేవంత్ రెడ్డి సొంత సర్వేలోనే నిజం తేలింది
KTR: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పతనం ఖాయమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
KTR: తెలంగాణలో కాంగ్రెస్ పని అయిపోయింది.. సీఎం రేవంత్ రెడ్డి సొంత సర్వేలోనే నిజం తేలింది
KTR: తెలంగాణ రాజకీయాల్లో సర్వేల కలకలం రేగుతోంది. రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీ పని ఇక అయిపోయినట్లేనని, ఆ పార్టీ పతనం దాదాపు ఖాయమైపోయిందని భరత రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (KTR) సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ హైదరాబాద్ నేతలతో నిర్వహించిన ఒక ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న కేటీఆర్, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు మరియు సర్వే ఫలితాలపై ఆసక్తికర వివరాలను వెల్లడించారు.
సగం పదవీ కాలం ముగిసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నాయకత్వం పైన, తన పరిపాలన పైన రాష్ట్రవ్యాప్తంగా ఒక విస్తృతమైన సొంత సర్వేను చేయించుకున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న తీవ్రమైన ఆగ్రహం మరియు ప్రజా వ్యతిరేకత ఈ సర్వేలో చాలా స్పష్టంగా వ్యక్తమైందని ఆయన వెల్లడించారు.
ఒకవేళ రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి (BRS) ఏకంగా సుమారు 78 సీట్లను కైవసం చేసుకుని మళ్లీ ఘనంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆ సర్వేలోనే తేలిందని కేటీఆర్ స్పష్టం చేశారు.
కేవలం ముఖ్యమంత్రి చేయించుకున్న సర్వేనే కాకుండా.. రెండు ప్రముఖ మీడియా సంస్థలతో పాటు, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఇంటెలిజెన్స్ విభాగాలు క్షేత్రస్థాయిలో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలోనూ ఇదే అంశం ముక్తకంఠంతో వ్యక్తమైందని కేటీఆర్ వివరించారు. తెలంగాణ ప్రజలు మరోసారి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నట్లు తమ అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారని ఆయన తెలిపారు.
సగం పరిపాలనా కాలం ముగిసేసరికే ప్రజలు కాంగ్రెస్ పార్టీ పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారని.. అటు సొంత సర్వేలతో పాటు ఇటు పలు ఇతర సర్వేల్లోనూ వ్యక్తమైన ఈ ఘోర ప్రజా వ్యతిరేకతను చూసి తట్టుకోలేకనే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత వారం రోజులుగా ప్రెస్ మీట్లలో అడ్డగోలుగా మాట్లాడుతున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ గ్రాఫ్ పూర్తిగా పడిపోయిందని, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని ఆయన పార్టీ శ్రేణుల్లో జోష్ నింపారు.




