KTR: రేవంత్ సర్కారు రాక్షసత్వానికి శంకర్ గౌడ్ బలి.. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్య..

KTR: ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతిపై కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని విమర్శిస్తూ.. బాధిత కుటుంబానికి కోటి రూపాయల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Arun Chilukuri
Published on: 24 April 2026 12:04 PM IST
KTR
X

KTR: రేవంత్ సర్కారు రాక్షసత్వానికి శంకర్ గౌడ్ బలి.. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్య..

KTR: వరంగల్ జిల్లా నర్సంపేటలో ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్యపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది బలవన్మరణం కాదు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన 'ముమ్మాటికీ హత్యే' అని ఆయన ఎక్స్ (X) వేదికగా ధ్వజమెత్తారు. కుటుంబ పెద్దను కోల్పోయిన శంకర్ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం వెంటనే కోటి రూపాయల ఆర్థిక సాయం అందించాలని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు.

నివాళులు అర్పించేందుకు వెళ్లిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, ఆర్టీసీ కార్మికులను అక్రమంగా అరెస్టు చేయడం దారుణమని, వారిని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఒకే రోజు ముగ్గురు ఆర్టీసీ డ్రైవర్లు ఆత్మహత్యాయత్నం చేయడం తెలంగాణ చరిత్రలో ఒక చీకటి రోజుగా మిగిలిపోతుందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల వేళ సవాలక్ష హామీలిచ్చిన రేవంత్ రెడ్డి, అధికారంలోకి వచ్చాక ఒక్కటి కూడా నెరవేర్చకపోవడం వల్లే కార్మికులు నిరాశలో ఉన్నారని విమర్శించారు.

ఆర్టీసీ కార్మిక సోదరులు ఎవరూ మనోధైర్యాన్ని కోల్పోవద్దని, ప్రాణాలు తీసుకోవద్దని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. "మీ పోరాటాలకు బీఆర్ఎస్ పార్టీ పూర్తి అండగా ఉంటుంది. ఈ నిరంకుశ సర్కారు మెడలు వంచి మీ హక్కులను సాధించే వరకు కలిసి పోరాడుదాం" అని ఆయన పిలుపునిచ్చారు. సమ్మె చేస్తున్న కార్మికులతో ప్రభుత్వం తక్షణమే చర్చలు జరిపి, ఆర్టీసీని నిర్వీర్యం చేసే కుట్రలను మానుకోవాలని కేటీఆర్ హితవు పలికారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story