KTR: తెలంగాణపై బీజేపీ విషం: తేజస్వీ సూర్య బేషరతుగా క్షమాపణ చెప్పాలి..

KTR: తెలంగాణ ఏర్పాటును పాకిస్థాన్ విభజనతో పోల్చిన తేజస్వీ సూర్య వ్యాఖ్యలపై కేటీఆర్ ఫైర్. బీజేపీ తెలంగాణ వ్యతిరేక పార్టీ అని విమర్శ. బేషరతు క్షమాపణకు డిమాండ్.

Arun Chilukuri
Published on: 16 April 2026 4:47 PM IST
KTR
X

KTR: తెలంగాణపై బీజేపీ విషం: తేజస్వీ సూర్య బేషరతుగా క్షమాపణ చెప్పాలి..

KTR: పార్లమెంట్ వేదికగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పాకిస్థాన్ విభజనతో పోల్చిన బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య వ్యాఖ్యలపై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కేవలం ఒక ప్రకటన కాదని, తెలంగాణ అస్తిత్వాన్ని, కోట్లాది మంది ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరచడమేనని ఆయన ధ్వజమెత్తారు.

తెలంగాణ ఏర్పాటును అంతటి దారుణమైన విభజనతో పోల్చుతుంటే, రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు మౌనంగా ఉండటం సిగ్గుచేటని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారని మండిపడ్డారు.

"తెలంగాణ పట్ల బీజేపీకి ఉన్న వ్యతిరేకత వారి నరనరనా నిండి ఉంది. గతంలో ప్రధాని మోదీ కూడా 'తల్లిని చంపి బిడ్డను వేరు చేశారు' అంటూ అవమానించారు, ఇప్పుడు అదే బాటలో వీరి ఎంపీలు ప్రయాణిస్తున్నారు" అని కేటీఆర్ గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమం, అమరుల త్యాగాలను అవమానించిన తేజస్వీ సూర్య తక్షణమే బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

రాష్ట్ర ప్రయోజనాల కంటే ఢిల్లీ బాసుల మెప్పు కోసమే పని చేస్తున్న నాయకులకు ప్రజలు త్వరలోనే బుద్ధి చెబుతారని కేటీఆర్ హెచ్చరించారు. తెలంగాణ అంటే ఒక పోరాటమని, దానిని తక్కువ చేసి చూపే ప్రయత్నం చేస్తే సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story