జల సంరక్షణ కోసం నడుంబిగించాలి.. కొలగాని శ్రీనివాస్

ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్ జల సంరక్షణపై కీలక వ్యాఖ్యలు చేశారు. నీటి ఎద్దడి నివారణ ప్రజల చేతుల్లోనే ఉందని, ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 22 March 2026 9:04 PM IST
Karimnagar
X

జల సంరక్షణ కోసం నడుంబిగించాలి.. కొలగాని శ్రీనివాస్

కరీంనగర్: వేసవి కాలంలో ఎదురయ్యే నీటి ఎద్దడిని ఎదుర్కోవాలంటే జల సంరక్షణ ఒక్కటే మార్గమని, ఆ బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని కరీంనగర్ నగర పాలక సంస్థ మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. ఆదివారం ఉదయం స్థానిక వైశ్య భవన్‌లో మానేరు పర్యావరణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ జల దినోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

‘సుజలాం సుఫలాం’ గోడప్రతుల ఆవిష్కరణ:

ఈ సందర్భంగా మేయర్ ‘సుజలాం సుఫలాం’ పేరుతో రూపొందించిన అవగాహన గోడప్రతులను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వర్షాకాలంలో కురిసే వాన నీటిని ఒడిసిపట్టడంలో మనం విఫలమవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. "భూగర్భ జలాలు అడుగంటిపోవడానికి మన నిర్లక్ష్యమే కారణం. నగరం లోని ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో కచ్చితంగా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలి" అని పిలుపునిచ్చారు. పొలాల్లో కూడా ఇంకుడు గుంతలు ఉంటే సాగునీటి ఇబ్బందులు ఉండవని ఆయన గుర్తు చేశారు.

భూగర్భ జలాల పెంపునకు మార్గాలు:

మానేరు పర్యావరణ సమితి అధ్యక్షులు తోట లక్ష్మణ రావు మాట్లాడుతూ.. ఎండిపోయిన బోరు బావుల చుట్టూ ఇంకుడు గుంతలు నిర్మించడం ద్వారా వాటిని పునరుద్ధరించవచ్చని తెలిపారు. గుట్టలు, బీడు భూముల వద్ద కాంటూరు కందకాలు తవ్వాలని, వాగులకు అడ్డంగా వాటర్ షెడ్ ప్రాజెక్టులు నిర్మించడం వల్ల భూగర్భ జల మట్టం పెరుగుతుందని వివరించారు.

కలుషిత నీటిపై ఆందోళన:

సర్వోదయ అధ్యక్షులు పెద్ది లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. కలుషిత నీరు తాగడం వల్ల లక్షలాది మంది, ముఖ్యంగా చిన్న పిల్లలు రోగాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. జల వనరులు కలుషితం కాకుండా కాపాడుకోవడం మనందరి కనీస ధర్మమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో 66వ డివిజన్ కార్పొరేటర్ వంగల పవన్, పర్యావరణ సమితి బాధ్యులు గంజి స్వరాజ్యబాబు, సామ నారాయణ, కొమురవెల్లి వెంకటేశం, గంగిశెట్టి సత్యనారాయణ మరియు పలువురు పర్యావరణ ప్రేమికులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story