Adluri Laxman: జగిత్యాలలో కాంగ్రెస్ సవాల్: 15 రోజుల్లో సభ.. సత్తా చూపిస్తామన్న అడ్లూరి..!
Adluri Laxman: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి జీవన్ రెడ్డిలపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ నిప్పులు చెరిగారు.
Adluri Laxman: జగిత్యాలలో కాంగ్రెస్ సవాల్: 15 రోజుల్లో సభ.. సత్తా చూపిస్తామన్న అడ్లూరి..!
Adluri Laxman: గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై, ఆ పార్టీ అధినేత కేసీఆర్పై రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన, తెలంగాణను అప్పుల పాలు చేసి, చివరకు ఔటర్ రింగ్ రోడ్డును కూడా అమ్మేసిన ఘనత కేసీఆర్ కుటుంబానిదేనని మండిపడ్డారు.
తన చావును కొందరు కోరుకుంటున్నారన్న కేసీఆర్ వ్యాఖ్యలను మంత్రి తప్పుబట్టారు. "ఎవరూ ఆయన చావును కోరుకోలేదు.. అలాంటి మాటలు మాట్లాడటం సరికాదు. వాస్తవానికి బీఆర్ఎస్ నాయకులే ముఖ్యమంత్రిని ఏకవచనంతో పిలుస్తూ నీచంగా మాట్లాడుతున్నారు. ప్రజలు మార్పు కోరుకుని కాంగ్రెస్ను గెలిపిస్తే.. ఓటమి భరించలేక ఉక్రోషంతో ఊగిపోతున్నారు" అని ఎద్దేవా చేశారు.
బీఆర్ఎస్లో చేరిన జీవన్ రెడ్డిపై మంత్రి అడ్లూరి ఆగ్రహం వ్యక్తం చేశారు. "రేవంత్ రెడ్డి ప్రభుత్వం పోవాలని జీవన్ రెడ్డి ఎందుకు నినాదాలు చేస్తున్నారు? పేదలకు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నందుకా? రైతులు పండించిన పంటను కొనుగోలు కేంద్రాల్లో సంతోషంగా అమ్ముకుంటుంటే మీకు నచ్చడం లేదా?" అని నిలదీశారు.
జీవన్ రెడ్డి పార్టీ వీడినంత మాత్రాన కాంగ్రెస్కు వచ్చిన నష్టం ఏమీ లేదని, కార్యకర్తలే పార్టీని ముందుండి నడిపిస్తారని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. "వచ్చే 15 రోజుల్లో జగిత్యాలలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తాం. జగిత్యాలలో సభ అంటే ఎలా ఉంటుందో.. కాంగ్రెస్ సత్తా ఏంటో చూపిస్తాం" అని సవాల్ విసిరారు.




