మరో వివాదంలో మంత్రి కొండా సురేఖ: ప్రధాని మోదీ పర్యటనపై సెటైర్లు.. 'జై శ్రీరామ్' వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్!
Konda Surekha: ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన వేళ మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు. "జై శ్రీరామ్ అంటే పైనుండి పైసలు పడతాయా?" అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం. రాజకీయాల్లో ముదురుతున్న వివాదం.
మరో వివాదంలో మంత్రి కొండా సురేఖ: ప్రధాని మోదీ పర్యటనపై సెటైర్లు.. 'జై శ్రీరామ్' వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్!
Konda Surekha: తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు ముందే రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ నెల 10న ప్రధాని రాకను పురస్కరించుకుని బీజేపీ 'జనాగ్రహ సభ'ను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుండగా, కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి విమర్శలు మొదలయ్యాయి. తాజాగా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రధాని మోదీ మరియు రాష్ట్ర బీజేపీ నేతలపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి.
ప్రధాని పర్యటనపై స్పందించిన కొండా సురేఖ, బీజేపీ నేతల తీరును ఎద్దేవా చేశారు. "మీటింగ్ పెట్టి కేవలం జై శ్రీరామ్ అంటే పైనుండి పైసలు పడతాయా?" అంటూ ఆమె ప్రశ్నించారు. కేవలం నినాదాలు చేయడం తప్ప, తెలంగాణకు రావాల్సిన నిధులు, పథకాల విషయంలో బీజేపీ నేతలు నోరు విప్పడం లేదని మండిపడ్డారు. రూ. 7 వేల కోట్ల అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం కేవలం నామమాత్రమేనని ఆమె విమర్శించారు.
కొండా సురేఖ వ్యాఖ్యలపై బీజేపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. పవిత్రమైన 'జై శ్రీరామ్' నినాదాన్ని కించపరిచేలా దేవాదాయ శాఖ మంత్రే మాట్లాడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. హిందూ సంఘాలు కూడా ఆమె వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రానికి కేంద్రం అందిస్తున్న సహకారంపై అవగాహన లేకుండా మంత్రి మాట్లాడుతున్నారని బీజేపీ నేతలు తిప్పికొడుతున్నారు.
తాజా వ్యాఖ్యలతో ప్రధాని పర్యటనకు ముందే తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్-బీజేపీ మధ్య యుద్ధం మొదలైంది. ప్రధాని మోదీ మూడోసారి బాధ్యతలు చేపట్టాక రాష్ట్రానికి వస్తున్న తరుణంలో ఈ విమర్శలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో వేచి చూడాలి.




