Ponguleti Srinivasa Reddy: రైతును రాజు చేసే వరకు విశ్రమించం: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
Ponguleti Srinivasa Reddy: రైతును రాజు చేసే వరకు విశ్రమించబోమన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అందిస్తున్న సాయాన్ని వివరించారు.
Ponguleti Srinivasa Reddy: రైతును రాజు చేసే వరకు విశ్రమించం: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
Ponguleti Srinivasa Reddy: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేతృత్వంలో తెలంగాణలో రైతు పక్షపాత ప్రభుత్వం నడుస్తోందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన ‘ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక’ మెగా రైతు మేళా కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై మంత్రి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రూ. లక్ష రుణమాఫీ చేయడానికి గత ప్రభుత్వానికి పదేళ్లు పట్టిందని ఎద్దేవా చేశారు. "గత పాలకులు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టినా, మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతులకు రూ. 21 వేల కోట్లు చెల్లించి చిత్తశుద్ధిని చాటుకుంది. గతంలో వరి వేస్తే ఉరి అన్న పరిస్థితి ఉండేది, కానీ నేడు వరి వేసిన రైతులకు అండగా నిలుస్తున్నాం" అని ఆయన పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా మంత్రి వివరించారు. పండించిన సన్న వడ్లకు మద్దతు ధరతో పాటు అదనంగా రూ. 500 బోనస్ అందిస్తున్నాం. రైతులకు ఎకరానికి రూ. 12 వేల ఆర్థిక సాయంతో పాటు అవసరమైన వ్యవసాయ పరికరాలను పంపిణీ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వ మ్యాచింగ్ గ్రాంట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ. 1,200 కోట్లు చెల్లిస్తోందని తెలిపారు.
"రైతును రాజు చేసే వరకు మా ప్రభుత్వం విశ్రమించదు" అని పొంగులేటి ధీమా వ్యక్తం చేశారు. రైతులకు కావాల్సిన మౌలిక సదుపాయాలు, విత్తనాలు, ఎరువుల సరఫరాలో ఎక్కడా రాజీ పడబోమని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.




