Ponnam Prabhakar: చంద్రబాబుకు మంత్రి పొన్నం బహిరంగ లేఖ
Ponnam Prabhakar: రాష్ట్ర విభజనపై అనుచిత వ్యాఖ్యలు సరికావంటూ ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ బహిరంగ లేఖ రాశారు.
Ponnam Prabhakar: చంద్రబాబుకు మంత్రి పొన్నం బహిరంగ లేఖ
Ponnam Prabhakar: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మరియు విభజన అంశంపై ఏపీ కూటమి నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఆయన ఒక బహిరంగ లేఖ రాశారు. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ విభజనపై మాట్లాడటం సముచితం కాదని హితవు పలికారు.
ప్రజల దశాబ్దాల ఆకాంక్షలకు అనుగుణంగా, అందరి ఆమోదంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని పొన్నం తన లేఖలో గుర్తుచేశారు. "ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయి. ఏపీ-తెలంగాణ ప్రజలు అన్నదమ్ముల్లా కలిసి మెలిసి ఉంటున్న ఈ సమయంలో విభజనపై విషం చిమ్మడం ఏంటి?" అని ఆయన ప్రశ్నించారు.
ముఖ్యంగా పార్లమెంట్లో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణ ఏర్పాటుపై చేసిన వ్యాఖ్యలను పొన్నం ప్రభాకర్ తీవ్రంగా ఖండించారు. ఆ వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని, వెంటనే ఆ వ్యాఖ్యలను పార్లమెంట్ రికార్డుల నుంచి తొలగించేలా ఎన్డీయే భాగస్వామిగా చంద్రబాబు చర్యలు తీసుకోవాలని కోరారు. ఏపీ కూటమి నేతలు సంయమనం పాటించాలని, లేనిపక్షంలో అది రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలను దెబ్బతీస్తుందని లేఖలో పేర్కొన్నారు.




