Moinabad Farmhouse Case: "షూట్ చేయండి.. నేను చూసుకుంటా!".. రిమాండ్ రిపోర్టులో కళ్లు చెదిరే నిజాలు!

Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో జరిగిన డ్రగ్స్ పార్టీ కేసులో పోలీసులు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి.

Arun Chilukuri
Published on: 16 March 2026 3:05 PM IST
Moinabad Farmhouse Case: షూట్ చేయండి.. నేను చూసుకుంటా!.. రిమాండ్ రిపోర్టులో కళ్లు చెదిరే నిజాలు!
X

Moinabad Farmhouse Case: "షూట్ చేయండి.. నేను చూసుకుంటా!".. రిమాండ్ రిపోర్టులో కళ్లు చెదిరే నిజాలు!

Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో జరిగిన డ్రగ్స్ పార్టీ కేసులో పోలీసులు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. స్విమ్మింగ్ పూల్ వద్ద మద్యం పార్టీతో పాటు డ్రగ్స్ వినియోగం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో కాల్పులు జరగడం కూడా పరిస్థితిని మరింత తీవ్రంగా మార్చింది. పోలీసులు ఫామ్‌హౌస్‌లోకి ప్రవేశించిన సమయంలో ముందుగా బుల్లెట్ శబ్దం వినిపించిందని రిమాండ్ రిపోర్టులో తెలిపారు. వెంటనే పోలీసులు అప్రమత్తమై తాము పోలీసులము.. కాల్పులు చేయవద్దు అని గట్టిగా హెచ్చరించారు. అయితే ఆ హెచ్చరికల తర్వాత కూడా మరో రెండు సార్లు కాల్పుల శబ్దం వినిపించిందని రిమాండ్ రిపోర్టులో తెలిపారు.

ఆ సమయంలో మీరు కాల్చేయండి.. ఏం జరిగినా బాధ్యత నాదే అని ఒకరు గట్టిగా చెప్పినట్టు పోలీసులు వివరించారు. పోలీసులు గట్టిగా అరిచిన వెంటనే కాల్పులు ఆగిపోయినట్లు వెల్లడించారు. పోలీసులు ఫామ్‌హౌస్‌లో సెర్చ్ వారెంట్‌తో తనిఖీలు నిర్వహించారు. బాత్రూం దగ్గర ఉన్న నమిత్ శర్మ చేతిలో తుపాకిని స్వాధీనం చేసుకున్నారు. బుల్లెట్ షెల్స్ పట్టుకుని ఉన్న మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో ఒక మహిళతో పాటు మొత్తం 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. జర్మన్ తయారీ పాయింట్ 0.32 రివాల్వర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొదట విచారణలో ఎవరూ డ్రగ్స్ తీసుకోలేదని చెప్పినా, పదేపదే ప్రశ్నించడంతో సిల్వర్ శరత్ కుమార్ డ్రగ్స్ తీసుకున్నట్టు ఒప్పుకున్నాడు. అతని వద్ద రెండు గ్రాముల కొకైన్ కూడా లభించింది. కొకైన్ ఎక్కడి నుంచి వచ్చిందనే విషయాన్ని మొదట ఎవరూ వెల్లడించలేదు. తరువాత పైలట్ రోహిత్ రెడ్డి డ్రైవర్‌ను విచారించగా అసలు విషయం బయటపడింది. విచారణలో కౌశిక్ రవి కొకైన్ తానే తెచ్చినట్లు ఒప్పుకున్నాడు. సిమ్లాకు బిజినెస్ ట్రిప్‌కు వెళ్లినప్పుడు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఈ డ్రగ్స్ కొనుగోలు చేశానని తెలిపాడు. డ్రగ్స్ పార్టీ కోసం కొకైన్ తీసుకొచ్చినట్లు చెప్పాడు. ఒక్క గ్రాము కొకైన్‌ను సుమారు 15 వేల రూపాయలకు కొనుగోలు చేసినట్లు వెల్లడించాడు.

పార్టీలో ఉన్న 11 మందికి డ్రగ్ టెస్టులు నిర్వహించగా పలువురికి పాజిటివ్ వచ్చింది. నమిత్ శర్మ, రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, పుత్త మహేష్ కుమార్, అర్జున్ రెడ్డి, కౌశిక్ రవికి డ్రగ్ పాజిటివ్ వచ్చినట్లు రిపోర్టులు వెల్లడించాయి. ఎర్రగడ్డ ఆసుపత్రిలో రెండోసారి నిర్వహించిన రక్త పరీక్షల్లో కూడా ఇదే విషయం బయటపడింది. నమిత్ శర్మ మూడు రకాల డ్రగ్స్ తీసుకున్నట్టు పరీక్షల్లో తేలింది. పోలీసులు ఫామ్‌హౌస్‌లోకి రావడంతో భయపడిపోయి వారిని భయభ్రాంతులకు గురిచేయడానికి కాల్పులు జరిపినట్లు నమిత్ శర్మ తెలిపినట్లు రిపోర్టులో పేర్కొన్నారు. కాల్పుల అనంతరం అక్కడి నుంచి పారిపోవాలని కూడా ప్లాన్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. విచారణలో భాగంగా పైలట్ రోహిత్ రెడ్డి ముందుగానే వీకెండ్ డ్రగ్ పార్టీ ఏర్పాటు చేసినట్లు సమాచారం ఇచ్చినట్లు తేలింది. అతని ఆహ్వానం మేరకు పలువురు ఫామ్‌హౌస్‌కు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఇంకా దర్యాప్తు కొనసాగుతుండగా, డ్రగ్స్ సరఫరా నెట్‌వర్క్‌పై కూడా పోలీసులు లోతుగా విచారణ చేపడుతున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story