MP Chamala Kiran Kumar Reddy: బీఆర్ఎస్కు జయంతులు లేవు.. వర్ధంతులే: ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
MP Chamala Kiran Kumar Reddy: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విమర్శలపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. బీఆర్ఎస్ పార్టీకి కాలం చెల్లిందని, కవిత వ్యాఖ్యలపై కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.
MP Chamala Kiran Kumar Reddy: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన విమర్శలకు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ధీటైన కౌంటర్ ఇచ్చారు. సోమవారం సీఎల్పీ మీడియా హాల్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ మనుగడపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
"కేసీఆర్ ఎప్పుడూ ఫాం హౌస్లోనే ఉండటం వల్ల రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఆయనకు అర్థం కావడం లేదు. ప్రజలు పశ్చాత్తాపపడుతున్నారని కేసీఆర్ భ్రమపడుతున్నారు, కానీ జనాలు ఇప్పుడు చాలా బాగున్నారు" అని కిరణ్ కుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు. కేసీఆర్కు మాట్లాడే అర్హత లేదని, బీఆర్ఎస్కు భవిష్యత్తులో వర్ధంతిలు మాత్రమే ఉంటాయని, జయంతులు ఉండవని ఘాటుగా విమర్శించారు.
సొంత కూతురు కవిత చేసిన వ్యాఖ్యలపై కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని ఎంపీ ప్రశ్నించారు. "మిమ్మల్ని (కుటుంబ సభ్యులను) జేబు దొంగలని కవిత విమర్శించింది. ఆ ప్రశ్నలకు కేసీఆర్ ఎందుకు సమాధానం చెప్పడం లేదు? మీ పార్టీ వారు లోక్సభలో ఉండకూడదని ప్రజలు కోరుకున్నారు కాబట్టే మీరు అక్కడ లేరు. పార్లమెంట్లో తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలపై నేనే గట్టిగా సమాధానం ఇచ్చాను" అని గుర్తు చేశారు.
బీఆర్ఎస్ అంతర్ధానం కావాలని తాము కోరుకోవడం లేదని, ఒకవేళ అలాంటి ఆలోచన ఉంటే అది కేసీఆర్ ఇంట్లో వాళ్లకే ఉండి ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ కుటుంబంలో జరుగుతున్న అంతర్గత పోరాటాలను ప్రజలపై రుద్దవద్దని సూచించారు.




