RTC JAC: ఆర్టీసీ సమ్మె.. మరో సకల జనుల సమ్మెగా మారబోతోంది
RTC JAC: తెలంగాణలో ఆర్టీసీ సమ్మె సైరన్ మోగింది. ఈ నెల 22 నుంచి సమ్మెకు వెళ్తున్నట్లు జేఏసీ ఛైర్మన్ వెంకన్న ప్రకటించారు.
RTC JAC: ఆర్టీసీ సమ్మె.. మరో సకల జనుల సమ్మెగా మారబోతోంది
RTC JAC: తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు మరో భారీ పోరాటానికి సిద్ధమవుతున్నారు. ఈ నెల 22 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేపట్టనున్నట్లు ఆర్టీసీ జేఏసీ (JAC) ఛైర్మన్ వెంకన్న స్పష్టం చేశారు. సమ్మె నోటీసు ఇచ్చి 41 రోజులు గడుస్తున్నా.. ప్రభుత్వం కానీ, ఆర్టీసీ యాజమాన్యం కానీ చర్చలకు పిలవకపోవడంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
మీడియాతో మాట్లాడిన వెంకన్న, ప్రభుత్వంపై పలు కీలక విమర్శలు చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పి, కాలయాపన కోసమే కమిటీలు వేశారని ఆరోపించారు. నష్టాల్లో ఉన్న మెట్రోను ప్రభుత్వపరం చేయాలని చూస్తున్న పాలకులు, ఆర్టీసీని మాత్రం విస్మరిస్తున్నారని మండిపడ్డారు. ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో ఆర్టీసీ ఆస్తులను ప్రైవేట్ పరం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, హైదరాబాద్లో ఆర్టీసీ ఉనికి లేకుండా చేసే కుట్ర జరుగుతోందని విమర్శించారు. మూసీ అభివృద్ధికి నిధులు ఉన్నప్పుడు, ఆర్టీసీని ఆదుకోవడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు ఎందుకు లేవని ప్రశ్నించారు.
అందరూ కలిసి రావాలి:
ఈ సమ్మెకు అన్ని ఆర్టీసీ సంఘాలు, ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయని.. ఔట్ సోర్సింగ్ సిబ్బంది కూడా పాల్గొనాలని వెంకన్న పిలుపునిచ్చారు. ఈ పోరాటం మరో 'సకల జనుల సమ్మె'గా మారుతుందని ఆయన హెచ్చరించారు. ఆర్టీసీ భూములను ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేయొద్దని డిమాండ్ చేశారు.




