Osmania University: విద్యార్థుల కోసం ఎస్బీఐ బస్సులు.. ప్రారంభించిన వీసీ
Osmania University: ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థుల రవాణా సౌకర్యం కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మూడు బస్సులను విరాళంగా ఇచ్చింది.
Osmania University: విద్యార్థుల కోసం ఎస్బీఐ బస్సులు.. ప్రారంభించిన వీసీ
Osmania University: ఓయూ క్యాంపస్ సహా విద్యార్థుల రవాణా అవసరాల కోసం కొర్పొరేట్ సామాజిక బాధ్యత కింద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మూడు బస్సులను విరాళంగా అందజేసింది. ఈ మేరకు బస్సుల తాళాలలను ఎస్బిఐ అధికారులు ఓయూ ఉపకులపతి ఆచార్య కుమార్ మొలుగరం కు అందజేశారు. సుమారు కోటి రూపాయల విలువైన ఈ విరాళం విశ్వవిద్యాలయ రవాణా సౌకర్యాలను గణనీయంగా మెరుగుపరచనుంది. రెండు సాధారణ బస్సులతో పాటు ఓ ఏసీ బస్సు కూడా ఎస్బీఐ అధికారులు ఓయూ కు అందజేశారు.
ఈ సందర్భంగా ఉస్మానియా విశ్వవిద్యాలయ గౌరవ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కుమార్ మొలుగరం మాట్లాడుతూ. ఓయూ విద్యార్థుల పట్ల భారతీయ స్టేట్ బ్యాంక్ అంకిత భావాన్ని ప్రశంసించారు. కోటి రూపాయల వ్యయంతో ఇచ్చిన మూడు బస్సులు కేవలం రవాణా సౌకర్యాన్ని మెరుగు పరచటమే కాకుండా. విద్యార్థుల విద్యా ప్రయాణానికి వెన్నుదన్నుగా నిలుస్తుందని కొనియాడారు. ప్రతిభకు నిలయమైన ఉస్మానియా వంటి విశ్వవిద్యాలయానికి, దేశంలోని అతిపెద్ద బ్యాంక్ అండగా నిలవడం భావితరాల నిర్మాణానికి ఎంతో తోడ్పడుతుందని గుర్త చేశారు.
భవిష్యత్తులోనూ ఈ సహకారం కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎస్బీఐ ప్రధాన అధికారి ఎస్. రాధాకృష్ణన్ మాట్లాడుతూ 219 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన స్టేట్ బ్యాంక్, 109 ఏళ్ల అద్భుత విద్యా వారసత్వం కలిగిన ఉస్మానియా విశ్వవిద్యాలయం కలిసి పనిచేయటం చారిత్రాత్మకమని అన్నారు. ఈ అవకాశం తమకు దక్కిన గొప్ప గౌరవంగా అభివర్ణించారు.
ఈ కార్యక్రమంలో ఎస్బీఐ జనరల్ మేనేజర్ సతీష్ కుమార్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ నరేష్ రెడ్డి, ఓఎస్డీ ప్రొఫెసర్ జితెంద్ర కుమార్ నాయక్, ప్రొఫెసర్ రాజశేఖర్ రెడ్డి, ప్రొఫెసర్ సి. కాశీం... ఎస్బీఐ అధికారులు పంకజ్ ప్రియదర్శి, రోహిత్ కుమార్, కొండ రవి శేఖర్, తంగి గణపతి, ఇతర అధికారులు పాల్గొన్నారు.




