Telangana Assembly: అసెంబ్లీ ప్రాంగణంలో పాము కలకలం.. ఊపిరి పీల్చుకున్న మీడియా సిబ్బంది
Telangana Assembly: అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద పాము కలకలం సృష్టించింది. భయాందోళనకు గురైన సిబ్బంది పరుగులు తీయగా' ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ ధైర్యంగా పామును పట్టుకుని బయట విడిచిపెట్టారు.
telangana assembly: అసెంబ్లీ ప్రాంగణంలో పాము కలకలం.. ఊపిరి పీల్చుకున్న మీడియా సిబ్బంది!!
హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఆవరణలో గురువారం ఒక్కసారిగా కలకలం రేగింది. అత్యంత భద్రత ఉండే అసెంబ్లీ ప్రాంగణంలోని మీడియా పాయింట్ వద్ద అకస్మాత్తుగా ఒక పాము ప్రత్యక్షమవడంతో అక్కడున్న సిబ్బంది, మీడియా ప్రతినిధులు భయాందోళనలకు గురయ్యారు.
ఒక్కసారిగా పరుగులు
మీడియా పాయింట్ సమీపంలో పాము సంచరిస్తుండటాన్ని గమనించిన సిబ్బంది ప్రాణభయంతో పరుగులు తీశారు. దీంతో అక్కడ కొంతసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. సమాచారం అందుకున్న భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు.
ట్రాఫిక్ కానిస్టేబుల్ సమయస్ఫూర్తి:
ఈ క్లిష్ట సమయంలో అక్కడ విధుల్లో ఉన్న ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ ఎంతో ధైర్య సాహసాలు ప్రదర్శించారు. ఏమాత్రం తడబడకుండా చాకచక్యంగా ఆ పామును బంధించారు. అనంతరం ఆ పామును సురక్షితంగా అసెంబ్లీ ఆవరణ బయట నిర్మానుష్య ప్రాంతంలో విడిచిపెట్టారు. పామును పట్టుకోవడంతో అసెంబ్లీ సిబ్బంది, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కానిస్టేబుల్ ప్రదర్శించిన సమయస్ఫూర్తిని అందరూ అభినందిస్తున్నారు.




