Ramchander Rao: కమల దళంలో జోష్.. కొత్త పదవులపై అనుమతి కోసం ఢిల్లీకి రాంచందర్ రావు!
Ramchander Rao: తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు హస్తిన పర్యటన రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
Ramchander Rao: కమల దళంలో జోష్.. కొత్త పదవులపై అనుమతి కోసం ఢిల్లీకి రాంచందర్ రావు!
Ramchander Rao: తెలంగాణ బీజేపీలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఇవాళ ఢిల్లీకి చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన పార్టీ జాతీయ అధిష్టానంతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో వరుస భేటీలు జరపనున్నారు. మధ్యాహ్నం బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్తో రాంచందర్ రావు ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. తెలంగాణలోని తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ బలోపేతం కోసం తీసుకుంటున్న చర్యలపై అధిష్టానానికి ఒక సమగ్ర నివేదికను రాంచందర్ రావు అందజేయనున్నారు. నితిన్ నబిన్తో సమావేశం అనంతరం ఆయన కేంద్ర న్యాయశాఖ మంత్రితో పాటు పలువురు కేంద్ర మంత్రులను కూడా మర్యాదపూర్వకంగా కలవనున్నారు.
ఈ ఢిల్లీ పర్యటనలో ప్రధానంగా తెలంగాణ బీజేపీ రాష్ట్ర కమిటీ విస్తరణ అంశంపైనే చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. కమిటీలోకి మరో నలుగురు కొత్త నాయకులను తీసుకునేందుకు రాంచందర్ రావు అధిష్టానం అనుమతి కోరనున్నారు.
కమిటీలో భర్తీ చేయబోయే పదవులు:
ఇద్దరు రాష్ట్ర ఉపాధ్యక్షులు (Vice Presidents)
ఇద్దరు రాష్ట్ర కార్యదర్శులు (State Secretaries)
ఈ నాలుగు కీలక స్థానాలను ఎవరెవరికి కేటాయించాలి? సామాజిక సమీకరణాలు, జిల్లాల వారీగా ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలనే లిస్టుపై జాతీయ అధ్యక్షుడితో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.
వచ్చే వారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ తెలంగాణలో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. రాంచందర్ రావుతో జరుగుతున్న నేటి భేటీలోనే ఈ పర్యటనకు సంబంధించిన తేదీలు, పూర్తి షెడ్యూల్ ఖరారు కానుంది. జాతీయ అధ్యక్షుడి పర్యటన సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సమావేశాలతో పాటు ఒక భారీ బహిరంగ సభ, కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించేందుకు రాష్ట్ర నాయకత్వం ఏర్పాట్లు చేస్తోంది.




