SSC Board Exams : పదో తరగతి పరీక్షలు క్యాన్సల్ అని సంబరపడ్డారా? అయితే మీకో షాకింగ్ న్యూస్
SSC Board Exams : తెలంగాణలో పదో తరగతి బోర్డు పరీక్షల రద్దుపై విద్యాశాఖ క్లారిటీ ఇచ్చింది. ఎక్కడా టెన్త్ పరీక్షలు రద్దు చేయలేదని, కేవలం ఇంటర్ ఫస్టియర్ పరీక్షల రద్దును మాత్రమే ప్రతిపాదించినట్లు స్పష్టం చేసింది.
SSC Board Exams
SSC Board Exams : తెలంగాణ విద్యావ్యవస్థలో పెను మార్పులు రాబోతున్నాయంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి విద్యాశాఖ కమిషన్ ఎండ్ కార్డ్ వేసింది. ముఖ్యంగా 2026-27 విద్యా సంవత్సరం నుంచి పదో తరగతి బోర్డు పరీక్షలు ఉండవని, ప్రభుత్వం వాటిని రద్దు చేసిందనే వార్తలపై కమిషన్ ఓఎస్డీ డాక్టర్ జీనత్ స్పష్టతనిచ్చారు. ఈ వార్తల్లో అస్సలు నిజం లేదని, విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని ఆమె తేల్చి చెప్పారు. తెలంగాణలో పదో తరగతి (SSC) బోర్డు పరీక్షలు రద్దు కాబోతున్నాయనే వార్తలు పూర్తిగా అవాస్తవమని విద్యాశాఖ కమిషన్ తేల్చి చెప్పింది. ఈ విషయంపై స్పందించిన ఓఎస్డీ డాక్టర్ జీనత్, తాము ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో టెన్త్ పరీక్షల రద్దు గురించి ఎక్కడా ప్రస్తావించలేదని స్పష్టం చేశారు. కేవలం ఎస్ఎస్సీ బోర్డును, ఇంటర్మీడియట్ బోర్డును ఒకే గొడుగు కిందికి తెచ్చి విలీనం చేయాలని మాత్రమే ప్రతిపాదించామన్నారు. ఈ ప్రక్రియలో భాగంగా 11వ తరగతి (ఇంటర్ ఫస్టియర్) పబ్లిక్ పరీక్షలను రద్దు చేయాలని సూచించామే తప్ప, 10వ తరగతి పరీక్షలను కాదని ఆమె వివరించారు. తప్పుడు వార్తలను నమ్మి విద్యార్థులు తమ ప్రిపరేషన్ను ఆపవద్దని కోరారు.
విద్యా వ్యవస్థలో సమూల మార్పులే లక్ష్యం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రాష్ట్ర విద్యా వ్యవస్థలో తీసుకురావాల్సిన మార్పులపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. జాతీయ విద్యా విధానం (NEP)కు అనుగుణంగా మన రాష్ట్రంలో కూడా విద్యా ప్రమాణాలను పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం నియమించిన కమిటీ అధ్యయనం ఇంకా కొనసాగుతోందని, వారు ఇచ్చే సూచనలను పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. తెలంగాణ విద్యార్థులు ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా విద్యా వ్యవస్థను తీర్చిదిద్దడమే తన లక్ష్యమని సీఎం పునరుద్ఘాటించారు.
బడ్జెట్ పై రాజకీయ వేడి
మరోవైపు మార్చి 20న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ పై అసెంబ్లీలో రాజకీయ రచ్చ మొదలైంది. ఈ బడ్జెట్ను ప్రజల బడ్జెట్ గా అభివర్ణించిన సీఎం రేవంత్ రెడ్డి, విపక్షాల తీరును ఎండగట్టారు. బడ్జెట్ ప్రతులను నిరసిస్తూ చెవిలో పూలు పెట్టుకుని అసెంబ్లీ నుంచి బయటకు వచ్చిన బీఆర్ఎస్ నేతలపై ఆయన ఘాటైన సెటైర్లు వేశారు. గత పదేళ్లుగా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన కేసీఆర్ ప్రభుత్వం, ఇప్పుడు తమ సంక్షేమ బడ్జెట్ను చూసి ఓర్వలేక నాటకాలు ఆడుతోందని ఆయన మండిపడ్డారు.
విద్యార్థులకు సూచనలు
ప్రస్తుతానికి పదో తరగతి పరీక్షల విధానంలో ప్రభుత్వం ఎటువంటి మార్పులు చేస్తూ అధికారిక జీవో విడుదల చేయలేదు. కాబట్టి విద్యార్థులు ఎప్పటిలాగే తమ పరీక్షలకు సిద్ధం కావాలి. బోర్డుల విలీనం, ఇంటర్ ఫస్టియర్ పరీక్షల రద్దు వంటి అంశాలు ఇంకా చర్చల దశలోనే ఉన్నాయి. ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకుంటే అధికారిక వెబ్సైట్ ద్వారా ప్రకటిస్తుంది. అప్పటివరకు సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మి అయోమయానికి గురికావద్దని విద్యాశాఖ విజ్ఞప్తి చేస్తోంది.




