Thanu Nayak: వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు తాను నాయక్

Thanu Nayak: వీర తెలంగాణ సాయుధ పోరాట యోధుడు థాను నాయక్ వర్ధంతి సందర్భంగా రాంనగర్‌లో నివాళులర్పించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 20 March 2026 5:31 PM IST
Thanu Nayak
X

 Thanu Nayak: వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు తాను నాయక్

రాంనగర్ (తెలంగాణ): గిరిజనులు, రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలను పరిష్కరించడమే వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు థాను నాయక్ కి అర్పించే నిజమైన నివాళి అని తెలంగాణ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బీమాసాహెబ్ పేర్కొన్నారు. బుధవారం రాంనగర్‌లో నిర్వహించిన థాను నాయక్ వర్ధంతి సభలో ఆయన పాల్గొని, గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు బోడ మోహన్ నాయక్ తో కలిసి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

భూ సమస్యలపై ధ్వజం:

ఈ సందర్భంగా బీమాసాహెబ్ మాట్లాడుతూ.. ధరణి పోర్టల్ లోని లోపాల వల్ల గిరిజనులు, రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు.

భూభారతిలో మార్పులు: కొత్తగా ప్రవేశపెట్టిన భూభారతి వెబ్సైట్‌లో భూ సమస్యల పరిష్కారానికి ఎమ్మార్వో (MRO) స్థాయి వరకు పాస్వర్డ్ అధికారాలు ఇవ్వాలని కోరారు.

సాదా బైనామాలు: రాష్ట్రవ్యాప్తంగా సాదా బైనామా క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకున్న 12 లక్షల మంది సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పహానీలో 'కాస్తు' కాలాన్ని తిరిగి పునరుద్ధరించాలని సూచించారు.

అడవి బిడ్డలకు హక్కులు కల్పించాలి:

అటవీ హక్కుల చట్టం-2006 ప్రకారం పోడు భూములను సాగు చేసుకుంటున్న గిరిజనులకు తక్షణమే హక్కు పత్రాలు (పట్టాలు) అందజేయాలని ప్రభుత్వాన్ని కోరారు. గతంలో గిరిజనులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. 1950 మార్చి 20న నిజాం రజాకర్ల అరాచకాలను ఎదిరించి ప్రాణాలర్పించిన థాను నాయక్ స్ఫూర్తితో గిరిజన యువత ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

దాడులపై ఆందోళన:

తెలంగాణ ఏర్పడ్డాక కూడా గిరిజనులపై దాడులు పెరగడం ఆందోళనకరమని, అడవిని నమ్ముకుని బతుకుతున్న గిరిజనులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. పట్టణాలకు దూరంగా వ్యవసాయంపైనే ఆధారపడే గిరిజనులకు భూమిపై పూర్తి హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు శివరాజ్, ప్రకాష్ నాయక్, నాగరాజు, అనిల్, రాజ్ కుమార్, రమేష్, సురేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story