ఇల్లు, భూమి కొనాలనుకుంటున్నారా? తెలంగాణలో భారీగా పెరగనున్న రిజిస్ట్రేషన్ ధరలు!
తెలంగాణలో వ్యవసాయ భూములు, ప్లాట్లు, అపార్ట్మెంట్ల మార్కెట్ విలువలను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. మే మొదటి వారం నుంచి అమల్లోకి రానున్న కొత్త ధరల వల్ల రిజిస్ట్రేషన్ ఛార్జీల భారం పెరగనుంది.
ఇల్లు, భూమి కొనాలనుకుంటున్నారా? తెలంగాణలో భారీగా పెరగనున్న రిజిస్ట్రేషన్ ధరలు!
Telangana Land Rates Hike: తెలంగాణలో ఇల్లు లేదా భూమి కొనుగోలు చేయాలనుకునే వారికి రాష్ట్ర ప్రభుత్వం షాకిచ్చేందుకు సిద్ధమైంది. రాష్ట్రంలో వ్యవసాయ భూములు, ప్లాట్లు, అపార్ట్మెంట్లు మరియు వాణిజ్య భవనాల ప్రభుత్వ మార్కెట్ విలువలను పెంచాలని సర్కార్ నిర్ణయించింది. ఈ సవరించిన కొత్త ధరలు మే మొదటి వారం నుంచే అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలోని వనరుల సమీకరణ కేబినెట్ ఉపసంఘం గత శుక్రవారం సచివాలయంలో సమావేశమై ఈ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. బహిరంగ మార్కెట్లో ఉన్న ధరలకు, ప్రభుత్వ రికార్డుల్లో ఉన్న ధరలకు మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉండటంతో ఈ సవరణ అనివార్యమని ప్రభుత్వం భావిస్తోంది. కొత్త రేట్ల అమలుకు అవసరమైన సాంకేతిక ఏర్పాట్లు చేయాలని రిజిస్ట్రేషన్ల శాఖను ఆదేశించింది.
పెరగనున్న రిజిస్ట్రేషన్ ఛార్జీల భారం
ప్రభుత్వ మార్కెట్ విలువలు పెరగడం వల్ల ఆస్తుల కొనుగోలుదారులపై స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీల భారం గణనీయంగా పెరగనుంది.
ఆదాయం: ఈ పెంపు ద్వారా రిజిస్ట్రేషన్ల శాఖకు అదనంగా సుమారు రూ. 2,000 కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
పారదర్శకత: రియల్ ఎస్టేట్ రంగంలో నల్లధనం లావాదేవీలను తగ్గించి, పారదర్శకతను పెంచడం కూడా ఈ నిర్ణయం వెనుక ఉన్న మరో ప్రధాన ఉద్దేశమని అధికారులు చెబుతున్నారు.
తెలంగాణలో గతంలో 2021లో బీఆర్ఎస్ ప్రభుత్వం మార్కెట్ విలువలను సవరించింది. డిసెంబర్ 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విలువలను పెంచడం ఇదే తొలిసారి. ఏడాది క్రితమే ఈ ప్రతిపాదన ఉన్నప్పటికీ, అప్పట్లో రియల్ ఎస్టేట్ మందగమనం వల్ల వాయిదా వేశారు. ప్రస్తుతం ఆదాయ వనరుల పెంపుపై దృష్టి పెట్టిన ప్రభుత్వం, మే నెల నుంచే ఈ కొత్త భారానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.




