Rythu Bharosa: రైతులకు గుడ్ న్యూస్.. మూడో విడత ‘రైతు భరోసా’ నిధులు విడుదల!

Rythu Bharosa: తెలంగాణలో 'రైతు భరోసా' పథకం మూడో విడత నిధులను ప్రభుత్వం విడుదల చేసింది.

Arun Chilukuri
Published on: 2 July 2026 3:01 PM IST
Rythu Bharosa
X

Rythu Bharosa: రైతులకు గుడ్ న్యూస్.. మూడో విడత ‘రైతు భరోసా’ నిధులు విడుదల!

Rythu Bharosa: తెలంగాణ రాష్ట్రంలో రైతు సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం 'రైతు భరోసా' (వ్యవసాయ పెట్టుబడి సాయం) పథకం అమలును దశలవారీగా విజయవంతంగా కొనసాగిస్తోంది. హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నిధులను అధికారికంగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. అనంతరం అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా సొమ్ము జమ చేసే ప్రక్రియ వేగంగా సాగుతోంది. ఇప్పటికే ఒకటి, రెండు విడతల పంపిణీ పూర్తి కాగా.. తాజాగా ప్రభుత్వం మూడో విడత నిధుల విడుదలకు శ్రీకారం చుట్టింది.

రైతు భరోసా మూడో విడతలో భాగంగా.. రాష్ట్రవ్యాప్తంగా 3 ఎకరాల నుండి 4 ఎకరాల వరకు సాగుభూమి కలిగిన రైతులకు పెట్టుబడి సాయం అందుతోంది. ఈ విడత కింద మొత్తం 6.39 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ. 1,330.32 కోట్లను ప్రభుత్వం నేరుగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) విధానంలో జమ చేస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.

గత రెండు విడతల వివరాలను పరిశీలిస్తే.. మొదటి విడతలో రెండు ఎకరాల లోపు భూమి ఉన్న 44.28 లక్షల మంది రైతులకు రూ. 2,482 కోట్ల సాయం అందించారు. రెండో విడతలో మూడు ఎకరాల వరకు సాగుభూమి ఉన్న చిన్న, సన్నకారు రైతులకు లబ్ధి చేకూర్చారు. ఈ తాజా మూడో విడతతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలోని మొత్తం 61.35 లక్షల మంది రైతులకు రూ. 5,402.37 కోట్ల మేర రైతు భరోసా ఆర్థిక సాయం అందినట్లయిందని మంత్రి స్పష్టం చేశారు.

రైతులకు వ్యవసాయ పెట్టుబడి భారాన్ని తగ్గించి, సాగును లాభసాటిగా మార్చడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "మా 30 నెలల ప్రజాపాలనలో రైతులు తలెత్తుకునేలా సంక్షేమ పాలన అందిస్తున్నాం. ఒకప్పుడు వ్యవసాయం దండగ అన్న పరిస్థితుల నుండి.. నేడు వ్యవసాయం అంటే ఒక పండుగగా భావించేలా ప్రభుత్వం రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తోంది." అని సీఎం స్పష్టం చేశారు.

భూమి విస్తీర్ణాన్ని ఆధారంగా చేసుకుని తక్కువ భూమి ఉన్న రైతులకు ప్రాధాన్యత ఇస్తూ విడతల వారీగా నిధులు విడుదల చేస్తున్నామని, ఇంకా మిగిలి ఉన్న అర్హులైన రైతులందరి ఖాతాల్లోనూ త్వరలోనే రైతు భరోసా సాయం దశలవారీగా జమ అవుతుందని వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story