Weather Alert: తెలంగాణ ప్రజలకు అలర్ట్.. వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Weather Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో తెలంగాణవ్యాప్తంగా వాతావరణ శాఖ భారీ వర్షాల హెచ్చరికలు జారీ చేసింది
Weather Alert
Weather Alert: తెలంగాణ వ్యాప్తంగా రాబోయే రోజుల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారడమే దీనికి ప్రధాన కారణం. ప్రస్తుతం ఈ వాయుగుండం ఒడిశాలోని బాలాసోర్ తీరానికి సమీపంలో కేంద్రీకృతమై పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతోంది. దీని ప్రభావంతో పాటు చురుగ్గా సాగుతున్న నైరుతి రుతుపవనాల కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉంది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు.
ఉరుములు, మెరుపులతో వానలు
రుతుపవనాల ప్రభావం ముఖ్యంగా ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాలపై తీవ్రంగా ఉండనుంది. వాతావరణ కేంద్రం నివేదికల ప్రకారం.. ఇవాళ ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వానలతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఉపరితల ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని అధికారులు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల కింద గానీ, పాతబడిన భవనాలు, విద్యుత్ స్తంభాల పరిసరాల్లో నిలబడకుండా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని విపత్తు నిర్వహణ శాఖ గట్టిగా సూచించింది.
హైదేరాబాద్లో చల్లబడ్డ వాతావరణం
మరోవైపు భాగ్యనగరంలో వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా మారింది. గత కొన్ని రోజులుగా సాధారణంగా ఉన్న వర్షపాతం, ఈ వారం మరింత పుంజుకోనుంది. సోమవారం రోజంతా హైదరాబాద్ నగరం, దాని చుట్టుపక్కల పరిసర ప్రాంతాలలో ఆకాశం మేఘావృతమై ఉంటుందని అధికారులు తెలిపారు. పగటిపూట తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు పడేందుకు 45 శాతం వరకు అవకాశాలు ఉన్నాయని, రాత్రి వేళకు ఈ తీవ్రత క్రమంగా తగ్గుతుందని అంచనా వేశారు. పశ్చిమ దిశ నుంచి చల్లటి గాలులు వీస్తుండటంతో నగరవాసులకు ఎండ వేడి నుంచి ఉపశమనం లభించింది.
ఉక్కపోత నుంచి ఉపశమనం
నిరంతరాయంగా కురుస్తున్న రుతుపవనాల వర్షాల కారణంగా రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే కాస్త తక్కువగా నమోదవుతున్నాయి. నగరంలో గరిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యే అవకాశం ఉంది. ఈ చల్లటి వాతావరణం వల్ల గత కొద్దిరోజులుగా ప్రజలను ఇబ్బంది పెడుతున్న ఉక్కపోత సమస్య నుంచి పెద్ద ఉపశమనం లభించినట్లయింది. అయితే వర్షాలు పడే సమయంలో వాహనదారులు, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలని, రహదారులపై నీరు నిలిచే అవకాశం ఉన్నందున జీహెచ్ఎంసీ సిబ్బంది కూడా అప్రమత్తంగా ఉన్నారని అధికారులు వెల్లడించారు.




