Rain Alert : తెలుగు రాష్ట్రాల ప్రజలారా అలర్ట్.. రాబోయే మూడు రోజులు కుండపోత వానలు.!
Rain Alert : ఎండలతో అల్లాడిపోయిన తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ఏపీ, తెలంగాణల్లో రాబోయే మూడు రోజుల పాటు భారీ నుండి..
Rain-alert
Rain Alert : ఎండలతో అల్లాడిపోయిన తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ఏపీ, తెలంగాణల్లో రాబోయే మూడు రోజుల పాటు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో వానలు దంచికొడుతుండగా, ఈ వర్షాల జోరు మరో మూడు రోజుల పాటు ఇలాగే కొనసాగనుంది. రాయలసీమ, తమిళనాడు మీదుగా తెలంగాణ నుండి మన్నార్ గల్ఫ్ వరకు ఒక బలమైన ద్రోణి ఏర్పడటమే దీనికి ప్రధాన కారణం. దీని ప్రభావంతో నైరుతి రుతుపవనాలు వేగంగా కదులుతూ తెలుగు రాష్ట్రాల్లో విస్తరిస్తున్నాయి.
తెలంగాణలో మళ్లీ పుంజుకున్న రుతుపవనాలు
నిజానికి ఈ నెల ఎనిమిదో తేదీనే రుతుపవనాలు తెలంగాణను తాకినప్పటికీ, ఆ తర్వాత కాస్త నత్తనడకన సాగాయి. కానీ ఇప్పుడు ద్రోణి ప్రభావంతో ఇవి మళ్లీ పుంజుకున్నాయి. రానున్న ఇరవై నాలుగు గంటల్లో తెలంగాణ అంతటా ఇవి పూర్తిగా విస్తరించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయని అధికారులు చెప్తున్నారు. దీనివల్ల రాబోయే మూడు రోజులు రాష్ట్రంలో భారీ వానలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వర్షంతో పాటు గంటకు నలభై నుండి యాభై కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు కూడా వీస్తాయని స్పష్టం చేసింది.
ఈ రోజు జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉంది. ఇక రేపు (బుధవారం) వరంగల్, మహబూబాబాద్, హనుమకొండ, ఆదిలాబాద్, మెదక్, కామారెడ్డి, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలకు వాతావరణ శాఖ 'ఎల్లో అలర్ట్' జారీ చేసింది. ఎల్లుండి (గురువారం) కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. మన హైదరాబాద్ విషయానికి వస్తే.. రాబోయే ఇరవై నాలుగు గంటల్లో నగరంలో ఎప్పుడైనా భారీ వర్షం పడొచ్చని అధికారులు అలర్ట్ చేశారు.
ఆంధ్రాలోనూ జోరు వానలు .. పిడుగుల హెచ్చరిక.!
మరోవైపు ఆంధ్రప్రదేశ్లోనూ ద్రోణి ప్రభావం గట్టిగానే చూపించబోతోంది. ఈ రోజు ఎన్టీఆర్ జిల్లా, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు కాకినాడ, ఏలూరు, కృష్ణా, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. అలాగే గుంటూరు, బాపట్ల, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, మార్కాపురం జిల్లాల్లోనూ వానలు దంచికొట్టనున్నాయి. వర్షాలతో పాటు కొన్ని జిల్లాల్లో పిడుగులు కూడా పడే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ప్రజలు, ముఖ్యంగా పొలం పనులకు వెళ్లే రైతులు, గొర్రెల కాపరులు చెట్ల కింద నిలబడకుండా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.




