Chamala Kiran Kumar Reddy: టెస్సరాక్ట్ కేటాయింపులు పారదర్శకమే.. బీఆర్ఎస్ ఆరోపణలను తిప్పికొట్టిన ఎంపీ చామల!
Chamala Kiran Kumar Reddy: టెస్సరాక్ట్ సంస్థకు భూ కేటాయింపులపై బీఆర్ఎస్ రాజకీయం చేస్తోందని ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి విమర్శించారు.
Chamala Kiran Kumar Reddy: టెస్సరాక్ట్ కేటాయింపులు పారదర్శకమే.. బీఆర్ఎస్ ఆరోపణలను తిప్పికొట్టిన ఎంపీ చామల!
Chamala Kiran Kumar Reddy: టెస్సరాక్ట్ (Tesseract) సంస్థకు భూముల కేటాయింపు వ్యవహారంపై బీఆర్ఎస్ పార్టీ అనవసర రాజకీయాలు చేస్తోందని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు. దిల్లీలోని తెలంగాణ భవన్లో ఇతర కాంగ్రెస్ ఎంపీలతో కలిసి గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్ (EMC)లో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 54 కంపెనీలకు భూ కేటాయింపులు జరిగాయని, అప్పట్లో ఎకరా భూమిని రూ. 30 లక్షల నుంచి రూ. 80 లక్షల చొప్పున మాత్రమే ఇచ్చారని ఎంపీ గుర్తుచేశారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 8 కంపెనీలకు భూ కేటాయింపులు పారదర్శకంగా జరిగాయని, ఎకరాకు అత్యధికంగా రూ. 1.50 కోట్లు ధర నిర్ణయించామని తెలిపారు.
టెస్సరాక్ట్ సంస్థ 5 ఎకరాల భూమి కోసం 2024లోనే దరఖాస్తు చేసుకుందని ఎంపీ వివరించారు. ఏడాది పాటు ఆ దరఖాస్తును అన్ని కోణాల్లో నిబంధనల ప్రకారం పరిశీలించిన తర్వాతే, 2025లో భూమిని కేటాయించామని స్పష్టం చేశారు. మిగతా కంపెనీలకు ఏ నిబంధనలైతే వర్తింపజేశామో, అదే విధంగా ఎకరా రూ. 1.50 కోట్ల చొప్పున ఈ సంస్థకు కూడా ఇచ్చామని పేర్కొన్నారు.
2025 వరకు టెస్సరాక్ట్ సంస్థకు కొండల్రెడ్డి డైరెక్టర్ కానీ, మేనేజింగ్ డైరెక్టర్ (MD) కానీ కాదని చామల స్పష్టం చేశారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే బీఆర్ఎస్ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.




