TGPSC Chairman: టీజీపీఎస్సీ పరీక్షల్లో భారీ మార్పులు.. ఇకపై 2,3 నెలలకోసారి అధికారిక మీడియా మీటింగ్!
TGPSSC Chairman: తెలంగాణలో ఉద్యోగ పరీక్షల నిర్వహణపై టీజీపీఎస్సీ (TGPSSC) చైర్మన్ బుర్రా వెంకటేశం సోమవారం హైదరాబాద్లో మీడియా వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు.
TGPSSC Chairman: టీజీపీఎస్సీ పరీక్షల్లో భారీ మార్పులు.. ఇకపై 2,3 నెలలకోసారి అధికారిక మీడియా మీటింగ్!
TGPSSC Chairman: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSSC) అభ్యర్థులకు సంబంధించి పరీక్షల నిర్వహణలో సరికొత్త విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టబోతోంది. భవిష్యత్తులో కమిషన్ నిర్వహించే అన్ని ఉద్యోగ నియామక పరీక్షలను కంప్యూటర్ ఆధారిత పరీక్ష (Computer-Based Test - CBT) విధానంలోనే నిర్వహించే దిశగా అడుగులు వేస్తున్నట్లు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం స్పష్టం చేశారు. సోమవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పరీక్షల సరళి, అక్రమాల నివారణ మరియు కమిషన్ తీసుకుంటున్న కొత్త చర్యలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
పరీక్షల నిర్వహణలో సాంకేతికత ప్రాధాన్యతను వివరిస్తూ చైర్మన్ బుర్రా వెంకటేశం ఆన్లైన్ విధానంపై మొగ్గు చూపారు. "పరీక్షల లీకేజీలకు తావులేకుండా పారదర్శకంగా నిర్వహించాలంటే కంప్యూటర్ బేస్డ్ పరీక్షల నిర్వహణే అన్నిటికంటే ఉత్తమమైంది. ఈ ఆన్లైన్ విధానంలో పరీక్ష ప్రారంభానికి కేవలం ఒక గంట ముందు కూడా ప్రశ్నాపత్రాన్ని సిద్ధం లేదా మార్పులు చేసే వెసులుబాటు ఉంటుంది. అదే పాత ఓఎంఆర్ (OMR) పద్ధతిలో పరీక్షల నిర్వహణ, పేపర్లు ముద్రించడం, వాటిని భద్రపరచడం చాలా క్లిష్టమైన ప్రక్రియ" అని ఆయన పేర్కొన్నారు.
ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై వస్తున్న విమర్శలపై కూడా చైర్మన్ స్పందించారు. టీజీపీఎస్సీ అనేది చాలా క్లిష్టమైన బాధ్యతలతో కూడుకున్న ఉద్యోగమని, ఇక్కడ అందరినీ ఒకేలా మెప్పించడం సాధ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. అర్హులైన వారికే ఉద్యోగాలు వస్తాయని, అందరికీ ఉద్యోగాలు ఇవ్వడం ఎప్పటికీ సాధ్యం కాదన్నారు. కమిషన్పై అసత్యాలు ప్రచారం చేసేవారు ఎప్పుడూ ఉంటారని వాటిని అభ్యర్థులు నమ్మవద్దని కోరారు.
సమారచార లోపం లేకుండా ఉండేందుకు ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు చెప్తూ.. "మీడియాతో మాట్లాడకపోవడం కంటే మాట్లాడటమే మంచిదని భావిస్తున్నాం. అందుకే, ఇకపై ప్రతి 2, 3 నెలలకోసారి అధికారికంగా మీడియా సమావేశాలు నిర్వహించి అభ్యర్థులకు అప్డేట్స్ ఇస్తాం" అని బుర్రా వెంకటేశం వెల్లడించారు. పరీక్షల నిర్వహణలో మరిన్ని సంస్కరణలు తీసుకురాబోతున్నట్లు ఆయన స్పష్టం చేశారు.




