Bandi Sanjay: సింధీల వేడుకల్లో పాల్గొన్న బండి సంజయ్
Bandi Sanjay: కరీంనగర్లో సింధీ ఆరాధ్య దైవం భగవాన్ ఝూలేలాల్ జయంతి వేడుకల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు.
Bandi Sanjay: సింధీల వేడుకల్లో పాల్గొన్న బండి సంజయ్
కరీంనగర్: భారతదేశ ప్రాచీన, సాంస్కృతిక చరిత్రలో సింధీ సమాజానిది ఒక ప్రత్యేక స్థానమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కొనియాడారు. సింధీల ఆరాధ్య దైవం భగవాన్ ఝూలేలాల్ జయంతి (చేటీ చంద్) మరియు సింధీ నూతన సంవత్సర వేడుకల సందర్భంగా కరీంనగర్లోని గాంధీ రోడ్ వైశ్యా భవన్ సమీపంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఉత్సాహంగా వేడుకలు - బైక్ ర్యాలీ:
ఈ సందర్భంగా సింధీ యువత, మహిళలు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనల్లో కేంద్ర మంత్రి స్వయంగా పాల్గొని వారితో కలిసి డ్యాన్స్ చేశారు. అనంతరం సింధీ సమాజం నిర్వహించిన భారీ బైక్ ర్యాలీని ప్రారంభించి, అందులో పాల్గొన్నారు. తెలుగు వారికి ఉగాది ఎంతటి ప్రాముఖ్యమో, సింధీలకు చేటీ చంద్ అంతటి పవిత్రమైనదని ఆయన పేర్కొన్నారు.
విభజన గాయాలను అధిగమించి..
బండి సంజయ్ మాట్లాడుతూ.. "దేశ విభజన సమయంలో సింధీ సమాజం తీవ్రంగా నష్టపోయింది. తమ నివాస ప్రాంతమైన 'సింధ్' పాకిస్థాన్లోకి వెళ్లడంతో ఆస్తులు, ఆలయాలను వదులుకుని శరణార్థులుగా భారత్కు వచ్చారు. సొంత రాష్ట్రం లేకపోయినా, ఝూలేలాల్ జీ చూపిన బాటలో నడుస్తూ తమ అస్తిత్వాన్ని, సంప్రదాయాలను కాపాడుకుంటున్న ఘనత వారికే దక్కుతుంది" అని అన్నారు.
ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక:
వ్యాపార రంగంలో సింధీలు ప్రపంచానికే మార్గదర్శకులని మంత్రి ప్రశంసించారు. అదానీ కుటుంబం, హిందూజా గ్రూప్, ఫ్యూచర్ గ్రూప్, లాల్ వాణీ గ్రూప్ వంటి దిగ్గజ వ్యాపార సామ్రాజ్యాల వెనుక సింధీ మూలాలు ఉన్నాయని గుర్తు చేశారు. అలాగే బీజేపీ వ్యవస్థాపకుల్లో ఒకరైన ఎల్.కె. అద్వానీ, బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ వంటి ప్రముఖులు ఈ సమాజం నుంచే వచ్చారని తెలిపారు.
సత్యమే గెలుస్తుంది:
"దేవుడు ఒక్కడే.. మానవత్వం ఒక్కటే" అన్న ఝూలేలాల్ జీ సందేశం నేటికీ అందరికీ ప్రేరణాదాయకమని, అన్యాయానికి వ్యతిరేకంగా ధైర్యంగా నిలబడాలన్న ఆయన బోధనలు అనుసరణీయమని బండి సంజయ్ పిలుపునిచ్చారు. సింధీలు మరింతగా రాణిస్తూ సమాజ సేవలో ముందుండాలని ఆకాంక్షించారు.




