Kishan Reddy: దక్షిణాదికి అన్యాయం జరగనివ్వం.. కాంగ్రెస్‌వే దిగజారుడు రాజకీయాలు

Kishan Reddy: నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లులపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

Arun Chilukuri
Published on: 14 April 2026 5:37 PM IST
Kishan Reddy
X

 Kishan Reddy: దక్షిణాదికి అన్యాయం జరగనివ్వం.. కాంగ్రెస్‌వే దిగజారుడు రాజకీయాలు

Kishan Reddy: నియోజకవర్గాల పునర్విభజన మరియు మహిళా రిజర్వేషన్ అంశాలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. మంగళవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, గతంలో కాంగ్రెస్ పెద్దలు తెలుగు ముఖ్యమంత్రులను ఎలా అవమానించారో ప్రజలందరికీ తెలుసని గుర్తు చేశారు.

డీలిమిటేషన్‌పై స్పష్టత:

నియోజకవర్గాల పునర్విభజన విషయంలో వస్తున్న విమర్శలపై కిషన్ రెడ్డి స్పందించారు. జనాభా ప్రాతిపదికన మాత్రమే సీట్లు పెంచితే దక్షిణాదికి నష్టం జరుగుతుందన్న ఉద్దేశంతోనే, ప్రతి రాష్ట్రంలోనూ 50 శాతం సీట్లు పెంచాలనే కొత్త ప్రతిపాదనను ప్రధాని మోదీ తెచ్చారని ఆయన తెలిపారు. ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగకూడదన్నదే కేంద్రం లక్ష్యమని, దీనిపై వితండవాదం చేయడం తగదని సూచించారు.

దక్షిణాది గౌరవంపై చర్చ:

దక్షిణాది రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఆయన తిప్పికొట్టారు. "వెంకయ్య నాయుడు, సీపీ రాధాకృష్ణన్ వంటి దక్షిణాది నేతలకు సముచిత గౌరవం ఇచ్చింది బీజేపీనే. రాహుల్ గాంధీ యూపీని వదిలి కేరళకు వెళ్లినప్పుడు లేని విమర్శలు, లక్ష్మణ్ గారిపై ఎందుకు?" అని ప్రశ్నించారు. దక్షిణాది సీఎంలకు రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వడం లేదని ఆయన ఎద్దేవా చేశారు.

జనగణన - కులగణన:

దేశంలో జరగబోయే జనగణనపై ఆయన కీలక అప్‌డేట్ ఇచ్చారు. "ఈసారి జనగణనతో పాటు కులగణన కూడా నిర్వహిస్తున్నాం. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి కొంత సమయం పడుతుంది" అని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ఇచ్చే డబ్బుతోనే కాంగ్రెస్ పార్టీ నడుస్తోందని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story