Doravarisatram: దొరవారిసత్రంలో డ్రగ్స్ వ్యతిరేక అవగాహన సదస్సు.. సిఐ హెచ్చరిక!
Doravarisatram: తిరుపతి జిల్లా దొరవారిసత్రం బీసీ వెల్ఫేర్ కాలేజీలో అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పోలీసులు అవగాహన సదస్సు నిర్వహించారు.
Doravarisatram: దొరవారిసత్రంలో డ్రగ్స్ వ్యతిరేక అవగాహన సదస్సు.. సిఐ హెచ్చరిక!
దొరవారిసత్రం: అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా తిరుపతి జిల్లా దొరవారిసత్రంలో మహాత్మా జ్యోతిరావు పూలే రెసిడెన్షియల్ కాలేజీలో విద్యార్థుల కోసం నిర్వహించిన అవగాహనా కార్యక్రమం ఎంతో స్ఫూర్తిదాయకంగా సాగింది. ఈ కార్యక్రమంలో సూళ్ళూరుపేట సీఐ ఎం.మురళీకృష్ణ, నాయుడుపేట సీఐ సంగమేశ్వరరావు, సూళ్ళూరుపేట ఎస్ఐ గంటా అజయ్ కుమార్, దొరవారిసత్రం పోలీస్ సిబ్బంది మరియు సుమారు 400 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
కార్యక్రమంలో భాగంగా సూళ్ళూరుపేట సీఐ ఎం.మురళీకృష్ణ మాట్లాడుతూ, నేటి యువత మాదకద్రవ్యాల ఊబిలో చిక్కుకుంటే వారి జీవితాలు అంధకారమవుతాయని హెచ్చరించారు. డ్రగ్స్ రవాణా, నిల్వ లేదా వినియోగం వంటివి కేవలం ప్రాణాలకే కాకుండా, ఉజ్వల భవిష్యత్తును పూర్తిగా నాశనం చేసే తీవ్రమైన నేరాలని గుర్తు చేశారు. చిన్నపాటి ఆకర్షణలకు లోనై చెడు అలవాట్లకు బానిసలైతే, చట్టపరమైన కఠిన చర్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని, పోలీసు రికార్డుల్లో నేరస్తులుగా నమోదైతే భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు సైతం దెబ్బతింటాయని ఆయన విద్యార్థులకు స్పష్టం చేశారు.
అనంతరం నాయుడుపేట సీఐ సంగమేశ్వరరావు మాట్లాడుతూ, వ్యసనాల వల్ల శారీరక ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా, మానసిక స్థిరత్వం కోల్పోయి క్రమశిక్షణ లేని జీవితానికి దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులు పుస్తకాలే ప్రాణంగా, లక్ష్యసాధనే ధ్యేయంగా ఎదగాలని, మాదకద్రవ్యాల వంటి వ్యసనాల పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. స్నేహితుల ఒత్తిడికి లొంగకుండా, సమాజంలో బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం మరియు సిబ్బంది పాల్గొన్నారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, యువత తప్పుడు మార్గాల్లో వెళ్లకుండా కన్నతల్లిదండ్రులు కూడా నిరంతరం పర్యవేక్షించాలని పోలీసులు సూచించారు. అనంతరం విద్యార్థులతో మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించారు.




