Tirupati: అమరావతి ఛాంపియన్షిప్ పోటీలు ప్రారంభం
Tirupati: తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో రాష్ట్రస్థాయి అమరావతి ఛాంపియన్షిప్ను ప్రారంభించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి. ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం.
Tirupati: అమరావతి ఛాంపియన్షిప్ పోటీలు ప్రారంభం
తిరుపతి: తిరుపతిలో రాష్ట్రస్థాయి అమరావతి ఛాంపియన్షిప్ క్రీడా పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని తారకరామా గ్రౌండ్స్లో నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు పాల్గొని అమరావతి ఛాంపియన్షిప్ పోటీలను ఘనంగా ప్రారంభించారు.
రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి 9 వేలకుపైగా అండర్-17, అండర్-23 బాలబాలికల క్రీడాకారులు ఈ ప్రతిష్టాత్మక పోటీల్లో పాల్గొనేందుకు తిరుపతికి తరలివచ్చారు. ఇంత భారీ స్థాయిలో రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు నిర్వహించడం ద్వారా యువ క్రీడాకారుల్లోని ప్రతిభను వెలికితీసేందుకు, వారికి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరింత ప్రోత్సాహం అందించేందుకు ఈ ఛాంపియన్షిప్ దోహదపడుతుందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని వెయిట్లిఫ్టింగ్ హాల్, క్రీడా ప్రాంగణాలు, ప్లేయర్ రిజిస్ట్రేషన్ కౌంటర్లను పరిశీలించారు. క్రీడాకారులకు కల్పిస్తున్న వసతులు, పోటీల నిర్వహణ, రిజిస్ట్రేషన్ ప్రక్రియ తదితర అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రస్థాయి అమరావతి ఛాంపియన్షిప్కు తిరుపతి వేదిక కావడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు.
భారీ స్థాయిలో నిర్వహిస్తున్న అమరావతి ఛాంపియన్షిప్ పోటీలు ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం దక్కించుకోవడం విశేషంగా నిలిచింది. ఈ రికార్డుకు సంబంధించిన గుర్తింపు పత్రాన్ని లిమ్కా బుక్ ప్రతినిధి హరీష్ శాప్ చైర్మన్ రవినాయుడు గారికి అందజేశారు. అనంతరం మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి చేతుల మీదుగా శాప్ చైర్మన్ రవినాయుడు గారు అవార్డును అందుకున్నారు.
యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడంతో పాటు ప్రతిభావంతులైన క్రీడాకారులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని మంత్రి తెలిపారు. క్రీడాకారులకు మెరుగైన మౌలిక వసతులు, శిక్షణ, ప్రోత్సాహం అందిస్తూ ఆంధ్రప్రదేశ్ను క్రీడా రంగంలో మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు అనగాని సత్యప్రసాద్, వంగలపూడి అనిత, ఎంపీ సానా సతీశ్బాబు, ఎమ్మెల్యేలు పి. నాని, బొజ్జల సుధీర్బాబు, మురళీ, ఎమ్మెల్సీలు భూమిరెడ్డి రామ్గోపాల్రెడ్డి, కంచికచర్ల శ్రీకాంత్, శాప్ చైర్మన్ రవినాయుడు, ఎండీ భరణి, పలువురు ఉన్నతాధికారులు, క్రీడా శాఖ అధికారులు, కోచ్లు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.




