Thiruchanur: గజవాహనం పై ఊరేగిన పద్మావతి దేవి విహారం
Thiruchanur: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఉత్తరాషాడ నక్షత్రం సందర్భంగా ప్రత్యేక పూజలు.
Thiruchanur: గజవాహనం పై ఊరేగిన పద్మావతి దేవి విహారం
Thiruchanur: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారు గురువారం రాత్రి గజవాహనం పై నాలుగు మాడా వీధుల్లో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. అమ్మవారి జన్మనక్షత్రం ఉత్తరాషాడ సందర్భంగా అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా అమ్మవారిని వేకువజామున సుప్రభాతంతో మేలుకొలిపి, నిత్య కైంకర్యాలు నిర్వహించారు. మధ్యాహ్నం శ్రీకృష్ణస్వామి ముఖ్యమండపంలో అమ్మవారి ఉత్సవమూర్తికి శాస్త్రోక్తంగా అభిషేకం చేశారు. సాయంత్రం అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఉంజల్ సేవ నిర్వహించారు.
అనంతరం విశేషాలంకరణలో విరాజిల్లుతున్న అమ్మవారు గజవాహనం పై తిరువీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారికి కర్పూర నీరాజనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్, ఏవిఎస్వో రాధాకృష్ణమూర్తి, ఏఈఓ దేవరాజులు, సూపరింటెండెంట్ మునిచెంగల్రాయల్, ఆగమ సలహాదారు మణికంఠ బట్టర్, అర్చకులు బాబుస్వామి, ఇన్స్పెక్టర్లు ప్రసాద్, చలపతి తదితరులు పాల్గొన్నారు.




