Tiruchanur: రెండో రోజుకు చేరిన తెప్పోత్సవాలు.. తెప్పలపై సుందరరాజ స్వామి విహారం!
Tiruchanur: శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాల్లో భాగంగా రెండవ రోజు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సుందరరాజ స్వామివారు తెప్పలపై విహరిస్తూ భక్తులకు కనువిందు చేశారు.
Tiruchanur: రెండో రోజుకు చేరిన తెప్పోత్సవాలు.. తెప్పలపై సుందరరాజ స్వామి విహారం!
తిరుచానూరు: శ్రీపద్మావతి అమ్మవారి తెప్పోత్సవాల్లో భాగంగా రెండవ రోజైన శుక్రవారం శ్రీదేవి భూదేవి సమేత శ్రీసుందరరాజ స్వామివారు తెప్పల పై విహరిస్తూ భక్తులకు కనువిందు చేశారు. ఇందులో భాగంగా స్వామివారిని వేకువజామున సుప్రభాతంతో మేలుకొలిపి నిత్య కైంకర్యాలు నిర్వహించారు.
మధ్యాహ్నం స్వామివారి ముఖమండపంలో స్వామివారి ఉత్సవర్లకు విశేషంగా అభిషేకం నిర్వహించారు. సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత సుందరరాజ స్వామి ఉత్సవర్లను పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలు, సుగంధ పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి తెప్పల పై కొలువుదీర్చారు.
అనంతరం స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి తెప్పల పై మూడు పర్యాయాలు విహరించి భక్తులకు దివ్యదర్శనమిచ్చారు. పెద్దసంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈవో డా. ఎ. శరత్, ఆలయ డిప్యూటీ ఈవో హరింధ్రనాథ్, ఏవిఎస్వో రాధాకృష్ణమూర్తి, సూపరింటెండెంట్లు ముని చెంగల్రాయలు, రమేష్, టెంపుల్ ఇన్స్పెక్టర్లు చలపతి, లక్ష్మీకాంత్, మునస్వామి, అర్చకులు బాబు స్వామి, వేంపల్లి శ్రీనివాసులు స్వామి, ఇతర అధికారులు, శ్రీవారి సేవకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.




