Tirupati: సి.మల్లవరంలో రూ.50 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జా టీడీపీ నేత ఆగ్రహం!
Tirupati: తిరుపతి రూరల్ సి.మల్లవరంలో రూ.50 కోట్ల కాలవ పోరంబోకు స్థలం కబ్జా యత్నం. వైఎస్సార్సీపీ మాజీ సర్పంచులపై టీడీపీ నేత మనోహర్ చౌదరి ధ్వజం.
Tirupati: సి.మల్లవరంలో రూ.50 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జా టీడీపీ నేత ఆగ్రహం!
Tirupati: తిరుపతి రూరల్ మండలం సి.మల్లవరం గ్రామంలో కాలవ పోరంబోకు స్థలం ఆక్రమణ తీవ్ర కలకలం రేపుతోంది. సుమారు 50 కోట్లకు పైగా విలువైన ప్రభుత్వ స్థలాన్ని వైఎస్సార్సీపీ నాయకులు కబ్జా చేయడానికి యత్నిస్తున్నారంటూ తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యదర్శి మనోహర్ చౌదరి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ "గతంలో అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీకి చెందిన ఇద్దరు మాజీ సర్పంచ్లే ఈ కోట్ల విలువైన కాలవ పోరంబోకు స్థలాన్ని అక్రమంగా పంచుకోవడం సిగ్గుచేటు.
గ్రామంలో వర్గాల మధ్య గొడవలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు. నీచమైన రాజకీయాల కోసం గ్రామ ప్రయోజనాలను పక్కనబెట్టి, సొంత జేబులు నింపుకోవడానికే ప్రభుత్వ భూములను కాజేస్తున్నారు. ఊరిలో ప్రభుత్వ సచివాలయం, పాఠశాలల అభివృద్ధి కోసం సెంటు స్థలం కూడా లేని పరిస్థితి ఉంటే... వీళ్లేమో కోట్ల విలువైన భూములను అడ్డగోలుగా కబ్జా చేస్తారా? ఈ దోపిడీని మేం చూస్తూ ఊరుకోం!" అని హెచ్చరించారు.
రూ. 50 కోట్లకు పైగా విలువైన ఈ ప్రభుత్వ స్థలాన్ని వెంటనే స్వాధీనం చేసుకుని కాపాడాలని జిల్లా కలెక్టర్, స్థానిక ఎంఆర్ఓలకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ కబ్జా వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునే వరకు వదిలిపెట్టేది లేదన్నారు.
ఈ ఆక్రమణ వ్యవహారాన్ని స్థానిక ఎమ్మెల్యే పులివర్తి నానితో పాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి కూడా తీసుకెళ్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆస్తులను ఆక్రమిస్తే ఎంతటివారైనా సరే చట్టం ముందు నిలబెడతామని మనోహర్ చౌదరి ఖరాకండీగా తేల్చి చెప్పారు.




