Tirupati: తడ నేషనల్ హైవేపై దారుణం.. స్పృహతప్పి పడిపోయిన వ్యక్తి మృతి!
Tirupati: జాతీయ రహదారిపై స్పృహతప్పి పడిపోయిన ఒక గుర్తుతెలియని వ్యక్తి (50-55 ఏళ్లు), సూళ్ళూరుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
Tirupati: తడ నేషనల్ హైవేపై దారుణం.. స్పృహతప్పి పడిపోయిన వ్యక్తి మృతి!
తిరుపతి జిల్లా: తడ మండలం పరిధిలోని జాతీయ రహదారిపై స్పృహతప్పి పడిపోయిన ఒక గుర్తుతెలియని వ్యక్తి సూళ్ళూరుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. మే 21వ తేదీ మధ్యాహ్నం సుమారు రెండు గంటల ప్రాంతంలో తడ మండలం, అపాచీ క్రాస్ సమీపంలో గల NH-16 రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ పై గోరింటాకు చెట్ల పొదల్లో సుమారు 50 నుండి 55 సంవత్సరాల వయస్సు గల ఒక మగ వ్యక్తి స్పృహ కోల్పోయి పడిపోయి ఉన్నాడు. ఆ దారిలో వెళ్తున్న బాటసారులు మరియు స్థానికులు దీనిని గమనించి వెంటనే 108 అంబులెన్స్కు సమాచారం అందించి, చికిత్స నిమిత్తం సూళ్ళూరుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అక్కడ అత్యవసర విభాగంలో చికిత్స పొందుతూ సదరు వ్యక్తి పరిస్థితి విషమించడంతో మే 22వ తేదీ ఉదయం మృతి చెందాడు. మృతుని వద్ద ఎలాంటి గుర్తింపు కార్డులు లేకపోవడంతో అతని పేరు, ఊరు మరియు ఇతర వివరాలు తెలియరాలేదు. ఈ సంఘటనపై కొండూరు విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ ఇచ్చిన రాతపూర్వక ఫిర్యాదు మేరకు తడ సబ్ ఇన్స్పెక్టర్ కొండప్పనాయుడు కేసు నమోదు చేయగా, తిరుపతి జిల్లా సూళ్ళూరుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం. మురళీకృష్ణ రంగంలోకి దిగి కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని విచారణ చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రిలో భద్రపరిచామని, మృతుడి ఆనవాళ్లు లేదా వివరాలు తెలిసిన వారు ఎవరైనా ఉంటే వెంటనే సూళ్ళూరుపేట సీఐ కార్యాలయంలో గానీ, తడ పోలీస్ స్టేషన్లో గానీ సంప్రదించాలని సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం. మురళీకృష్ణ ఈ సందర్భంగా ప్రజలను కోరారు.




