పథకాన్ని నిర్వీర్యం చేసేందుకే 40% భారం: hmtv చర్చలో కేంద్రంపై కాంగ్రెస్ నేత జితేందర్ తీవ్ర విమర్శలు!
ఉపాధి హామీ పథకాన్ని ‘విబిజి రాంజీ’గా మార్చడం వెనుక మహాత్మా గాంధీ పేరును తొలగించాలనే దుర్బుద్ధి ఉందని కాంగ్రెస్ నేత జితేందర్ మండిపడ్డారు.
పథకాన్ని నిర్వీర్యం చేసేందుకే 40% భారం: hmtv చర్చలో కేంద్రంపై కాంగ్రెస్ నేత జితేందర్ తీవ్ర విమర్శలు!
గతంలో వంద శాతం కేంద్ర ప్రభుత్వమే భరించిన ఉపాధి హామీ పథకాన్ని, ఇప్పుడు ‘విబిజి రాంజీ’గా మార్చి రాష్ట్రాలపై 40 శాతం వాటాను రుద్దడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. hmtv ప్రత్యేక రాజకీయ విశ్లేషణలో పాల్గొన్న కాంగ్రెస్ సీనియర్ నేత జితేందర్.. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఈ సంక్షేమ పథకాన్ని దెబ్బతీస్తోందని ఆరోపించారు.
గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం, ఉపాధి లేక ఇళ్లకు తాళాలు వేసి వలస వెళ్తున్న వలస కార్మికుల దుస్థితిని చూసి ఆనాడు సోనియా గాంధీ చలించిపోయారని జితేందర్ గుర్తుచేశారు. వలసలను నివారించడానికే మన్మోహన్ సింగ్ ప్రభుత్వ హయాంలో "మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని" అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచే ప్రారంభించారని పేర్కొన్నారు. ఆనాడు రాష్ట్రాలపై ఒక్క రూపాయి భారం వేయకుండా 100 శాతం నిధులు కేంద్రమే ఇచ్చిందన్నారు.
మహాత్మా గాంధీ పేరు తీసేసి ‘విబిజి రాంజీ’ అని పేరు మార్చడం వెనుక కేంద్రానికి ఉన్న దుర్బుద్ధి ఏంటని ఆయన ప్రశ్నించారు. "రాముడు దేవుడు.. గుడిలో ఉంచి మనమంతా పూజిస్తాం. నేను కూడా హిందువునే, ఎవరి మనోభావాలు దెబ్బతీయకూడదు. కానీ కేవలం గాంధీ గారి పేరును తొలగించాలనే ఒకే ఒక దురుద్దేశంతో ఈ పేరు మార్పులు చేస్తున్నారా?" అని జితేందర్ నిలదీశారు.




